ఓ పంట చేతికంది, మరో పంటకు ఉరకలేసే రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ, ఈసారి పండుగ రోజులు రైతన్నకు అదురుపాటుతోనే గడిచాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్తపంటకు నీళ్లివ్వలేమని కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేస్తున్నది. దాంతో క్రాప్ హాలిడే అనే మాట తరచుగా చెవులపడుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రాకతో ఆయకట్టు పెరిగిన మన రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తడం ఆందోళనకరం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అంత మంచి విషయం కాదు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీళ్లు రావని అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే ప్రాజెక్టు బరాజ్లలో నీళ్లు లేవనే కారణంతో సాగునీరు విడుదల చేయలేమని అంటున్నది. రైతులు అర్థం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకూ నీరివ్వలేమని అంటున్నారు. ఇది గోదావరి నీటి సంగతి. ఇక కృష్ణా బేసిన్లోనూ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఈ ఏడాది కృష్ణాకు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. ఎగువన జూరాల మినహాయిస్తే దిగువన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో నీరు లేదు. కర్ణాటకను అడిగి నీటిని తెప్పిస్తామని అంటున్నారు. కానీ, అక్కడా ప్రాజెక్టుల్లో నీరు అంతంతమాత్రంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో మేలుకొని స్పందించాలి.
ఇది సాకులు వెతికే సమయం కాదు. నెపం ఎవరి మీదనో, దేనిమీదనో తోసి పబ్బం గడుపుకొనే సమయం ఆసలేకాదు. సత్వరమే నీటి సరఫరాకు పటిష్టమైన చర్యలు చేపట్టి రైతన్నకు, ప్రజలకు భరోసా కల్పించాల్సిన తరుణమిది. స్వరాష్ట్ర సాధన తర్వాత పంట విస్తీర్ణం పెరిగింది. దిగుబడి ఇబ్బడి ముబ్బడి అయ్యింది. ఉచిత కరెంటు, దండిగా సాగునీరు, రైతుబంధు, రైతుబీమా వంటి మన వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. వరి దిగుబడిలో పంజాబ్ను మన తెలంగాణ అధిగమించింది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం ప్రతిష్టంభన ఎదుర్కొంటున్నది.
తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బాగుపడిన సాగు మళ్లీ ఆగమాగమైపోతున్నట్టు కనిపిస్తున్నది. సాగునీరు ఇవ్వలేమంటున్నారు. కరెంటుకూ కోతలు తప్పడం లేదు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం మంచిదికాదు. ప్రభుత్వం బరాజ్ల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించి సాగునీటి పారుదల మెరుగుపర్చేందుకు నడుం బిగించాలి. కరెంటు ఉత్పత్తిని, కొనుగోలును తగిన రీతిలో సమన్వయపర్చుకుని సరఫరాను సరిదిద్దాలి. మేలురకం విత్తనాలు, నాణ్యమైన ఎరువులు తగినంతగా రైతులకు అందుబాటులో ఉంచాలి. అంతకంటే ముందుగా పంట పెట్టుబడి సాయం రైతుబంధు, రుణమాఫీ గురించి కూడా ఆలోచించాలి. అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.