పార్లమెంటులో రంగు పొగల దాడి సెగలు పుట్టిస్తున్నది. దాడిచేసిన వారి ఉద్దేశం ఏమైనప్పటికీ జరిగింది భద్రతా వైఫల్యం అనేది అందరూ అంగీకరించే విషయమే. ఆగంతకులు సభలోకి ప్రవేశించి వీరంగం వేయడం చూసి దేశం నివ్వెరపోయింది. కానీ, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ తేలిక చేసి మాట్లాడటం అంతకన్నా ఎక్కువ విస్మయాన్ని కలిగించింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పడు కీలక ఘటనలపై మంత్రులు ప్రకటనలు చేయడం సంప్రదాయం. ఇక్కడ ఘటన జరిగింది పార్లమెంటు లోపలే.
భద్రతా వైఫల్యం వల్ల తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఉదంతంపై ప్రభుత్వం లేదా హోంమంత్రి సభలో నోరు విప్పకపోవడం ఏమిటనేది ఇక్కడ ప్రశ్న. కేంద్ర పెద్దలు ఈ అంశంపై పార్లమెంటు వెలుపల మాట్లాడారు కానీ సభా వేదికగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. అదో పెద్ద విషయమే కాదన్నట్టు బీజేపీ నేతలు ప్రకటనలు చేయడం తెలిసిందే. ప్రధాని మోదీ చాలా ఆలస్యంగా స్పందిస్తూ తీవ్రమైన ఉల్లంఘనే అని అంగీకరిస్తూనే దీనిపై రాద్ధాంతం అనవసరమని అనడం గమనార్హం. పనిలో పనిగా ఆయన విపక్షాలపై విమర్శలు కూడా చేశారు. హోంమంత్రి అమిత్ షా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ అంశంపై యథాలాపంగా మాట్లాడారు తప్ప సభలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
తీవ్రంగా పరిగణించాల్సిన అంశంపై ప్రభుత్వం సభలో ప్రకటన చేయాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. దాంతో విపక్షాలు సభలో ఆందోళనకు దిగుతున్నాయి. దీనివల్ల పార్లమెంటులో నిత్యం గలభా జరిగి ప్రతిష్ఠంభన ఏర్పడుతున్నది. వాయిదాల మీద వాయిదాలతో సభా సమయం వృథా అవుతున్నది. పార్లమెంటు ఉభయసభల నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం నిత్యకృత్యమైపోయింది.
ఈ సెషన్లో ఇప్పటి వరకు ఉభయసభల్లో ఈ అంశంపై సస్పెండైన సభ్యుల సంఖ్య 141కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదొక రికార్డు అంటున్నారు. కాగా ఈ సంపాదకీయం రాస్తున్న సమయానికి పార్లమెంటు అట్టుడుకుతూనే ఉన్నది. మరికొందరు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తుండగా, విపక్షాలు క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు.
పార్లమెంటుపై నాటకీయంగా దాడి జరిపిన నిరసనకారులపై‘ఉపా’ వంటి కఠిన చట్టాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వం చర్చకు ఎందుకు జంకుతున్నదో తెలియడం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చర్చే ప్రాణాధారం. ప్రజాసమస్యలు చర్చించాల్సిన అత్యున్నత వేదిక అయిన పార్లమెంటులో చర్చ లేకుండానే బిల్లులు పాసవుతుండటం చూస్తున్నాం. చర్చను డిమాండ్ చేస్తున్న విపక్షాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీర్తిప్రతిష్ఠలు పొందిన భారత్కు ఇది అంతగా శోభించదు.