ఎనిమిదేండ్లలో రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఫలితంగా 22.5 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ఘనత ఇది. ఇది కూడా టీఎస్-ఐపాస్ కింద వచ్చిన పెట్టుబడులను, ఐటీ, ఐటీ సేవల రంగంలో వచ్చిన వాటిని లెక్కిస్తేనే. రియల్ ఎస్టేట్, మైనింగ్, ఆతిథ్యం తదితర రంగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, లభించిన ఉద్యోగాలు మరింత అధికంగా ఉంటాయన్న మంత్రి కేటీఆర్ మాటలు వాస్తవం. వాటిపై సవివరమైన నివేదిక రూపొందించమని ఉన్నతాధికారులను ఆదేశించటం ముదావహం. ఈ గణాంకాలన్నీ ప్రజల ముందు వెల్లడి కావాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ అభివృద్ధిని గుండె నిండా కాంక్షించే వారి కోసమే కాదు, బట్ట కాల్చి మీదేస్తున్న కుసంస్కారుల ఆరోపణలను తిప్పికొట్టటానికి కూడా అవసరం.
ఆవిర్భావానికి ముందే తెలంగాణ అనేక అపహాస్యాలను, ఆరోపణలను ఎదుర్కొన్నది. రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్లకు, ఉగ్రవాదులకు నిలయమవుతుందన్నారు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే అంధకారం అలుముకుంటుందన్నారు. రాజకీయ అస్థిరత రాజ్యమేలుతుందన్నారు. ఆ మాటలు మాట్లాడిన వాళ్లు ఆ తర్వాత నిజాయితీగా తమ తప్పును ఒప్పుకోకపోయినా, తెలంగాణ తానేమిటో నిరూపించుకున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకూ, కులవృత్తులను సుసంపన్నం చేయటం నుంచి విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేయటం వరకూ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శమైంది. భారతదేశపు వేగుచుక్కగా నిలిచింది. కానీ, తెలంగాణను తెర్లు చేద్దామనుకునే వాళ్లు ఆగలేదు. మళ్లీ రకరకాల రూపాల్లో ముందుకొచ్చారు, వస్తున్నారు. నిరాధార ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. దేశ రాజకీయాల్ని మార్చటానికి, తెలంగాణ మాడల్ను దేశవ్యాప్తం చేయటానికి బయల్దేరిన కేసీఆర్ను అడ్డుకోవటమే వారి లక్ష్యం. వారి కుట్రలు సాగవు. కేసీఆర్ ఆగరు. తెలంగాణ ప్రగతి రథం కూడా ఆగబోదు.
మన విజయాల్ని యావత్ దేశం వినేలా గట్టిగా చెప్పాల్సిన సందర్భం ఇది. కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలో ఒక రాష్ట్రం ఎటువంటి మహత్తర విజయాలను నమోదు చేసిందో తెలుపాల్సిన సందర్భం ఇది. ఆ విజయాలకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, నాయకత్వం గురించి ఎరుకపరచాల్సిన సందర్భం ఇది. ఇదే ఎనిమిదేండ్లలో నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం సమస్త రంగాల్లో ఎలా కునారిల్లింది. దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ యవనికపై ఏ విధంగా పతనమైంది. మతవిద్వేషం దేశాన్ని ఏ రకంగా మధ్యయుగాల వైపు తీసుకెళ్తున్నది. ఇది కూడా సమస్త భారతీయులకు తెలియాలి. చీకటిని చూసిన వాళ్లకే సూర్యకాంతి విలువ తెలుస్తుంది. అప్పుడే, అంధకారం నుంచి విముక్తి కోసం ముందడుగు వేయటానికి సిద్ధపడుతారు. తెలంగాణ నుంచి మొదలైన వెలుగు పుంజం యావత్ దేశాన్ని ప్రకాశవంతం చేసే రోజు తప్పక వస్తుంది.