కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం-370 రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు ఏ రకంగా చూసినా చరిత్రాత్మకమైందేనని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నలుగుతున్న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం సూచించే తీర్పుగా దానిని భావించవచ్చు. ఐదు వందల పైచిలుకు సంస్థానాల సంగతి ఎటూ తేలకుండానే మనకు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించింది. హైదరాబాద్, జునాగఢ్ సమస్యలు నయానా భయానా పరిష్కారమయ్యాయి. కానీ, కశ్మీర్ సమస్య మాత్రం అపరిష్కృతంగా ఉండిపోయింది. అందుకు ఆనాటి నేపథ్యమే బీజాలు వేసింది. పాకిస్థాన్ వైపు నుంచి ముష్కర మూకలు శ్రీనగర్ వైపు దూసుకువస్తున్న తరుణంలో మహారాజా హరిసింగ్ భారత్లో విలీనానికి అంగీకరించి ఒప్పందం చేసుకున్నాడు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆ ఒప్పందంలో చేర్చిన నిబంధనల మేరకే అధికరణం 370 వచ్చింది. ‘యుద్ధతరహా’ కల్లోల పరిస్థితుల కారణంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడమనేది తాత్కాలిక వ్యవహారమేనని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చిచెప్పడం గమనార్హం. పైగా ఒక దేశంలో రెండు సార్వభౌమాధికారాలు పొసగవని కూడా సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది. భారత్లో విలీనం తర్వాత కశ్మీర్కు ఎలాంటి సార్వభౌమాధికారం దఖలు పడలేదనేది ఈ తీర్పు అంతరార్థంగా భావించాల్సి ఉంటుంది. 370 అధికరణం రద్దు చేస్తూ వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులపై పరిశీలన జరుపలేమని స్పష్టం చేయడం ద్వారా కేంద్రం వైఖరిని సుప్రీంకోర్టు సంపూర్ణంగా సమర్థించింది.
ఈ తీర్పులోని మరో పార్శ్వం కశ్మీర్లో ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించింది. 370 అధికరణం రద్దు తర్వాత కేంద్రం కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. లద్ధాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా విడగొడుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిబంధనల కింద చెల్లుబాటు అవుతుందని తెలిపిన సుప్రీంకోర్టు జమ్మూకశ్మీర్ విషయంలో కీలక సూచనలు చేసింది. కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించడం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్న కేంద్ర వాదనను పరిగణనలోకి తీసుకుంటూ, వీలైనంత త్వరలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించి 2024లోగా అక్కడ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. సుదీర్ఘకాలం అల్లకల్లోలంగా ఉండి, ఇటీవల కీలక మార్పుచేర్పులకు గురైన కశ్మీర్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను తద్వారా గుర్తుచేసింది. ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తయినందున అందుకు మార్గం ఈ సరికే సుగమమైంది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందర కొంత ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా అన్నిపక్షాలూ ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కశ్మీర్లో ఎక్కువకాలం అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అందుకు సమ్మతి తెలుపడం ఆహ్వానించదగిన పరిణామం. సర్వోన్నత న్యాయసమీక్ష పట్ల రాజకీయ వ్యవస్థ విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నది. కశ్మీరీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాతినిధ్య పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అన్నిపక్షాలూ కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.