యువనేతగా దేశవ్యాప్త జనాకర్షణ గల రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ-రేస్ను జరపడానికి చూపుతున్న చొరవ, పట్టుదల సంచలనాత్మకం అయింది. కానీ తెలంగాణ రాష్ర్టాన్ని అనేక రంగాలలో అద్వితీయమైనదిగా తీర్చిదిద్దుతున్న క్రమంలో- ‘మొబిలిటీ వ్యాలీ’ పేర శుద్ధ ఇంధన వాహన రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక చర్యలలో ఇదొక భాగం మాత్రమే. రాష్ట్ర సౌర ఇంధన విధానం జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నట్టుగానే, విద్యుత్ వాహన విధానమూ భళా అనిపించుకున్నది. ఇప్పుడు మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయతలపెట్టడం రాబోయే కాలానికి మనం ఏ విధంగా సిద్ధమవుతున్నామో చాటుతున్నది. ఈ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఐదేండ్ల వ్యవధిలోనే రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ‘మొబిలిటీ నెక్స్ హైదరాబాద్ సమిట్’లో వెల్లడించడం విశేషం.
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే అని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో ఈ పరిశ్రమను హైదరాబాద్ నగరం పొలిమేరల్లో స్థిరపరచడానికి అన్ని హంగులు కల్పిస్తున్నది. జహీరాబాద్, సీతారామ్పూర్లలో తయారీ క్లస్టర్లను, దివిటిపల్లిలో ఇంధన నిల్వ వ్యవస్థ క్లస్టర్ను, యంకతలలో ఆవిష్కరణల క్లస్టర్ను వృద్ధి చేయతలపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సమగ్ర మౌలిక వసతుల కారణంగా – వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీల తయారీతో పాటు పరిశోధనలు, పరీక్షలు మొదలైనవన్నీ ఇక్కడే సాగుతాయి. స్టార్టప్లకు కూడా ఇతోధిక ప్రోత్సాహం లభిస్తుందనేది స్పష్టం. ఆటోమోటివ్ ఇంజినీరింగ్ పరిశోధన- అభివృద్ధిలోనూ హైదరాబాద్ తన సత్తా చాటబోతున్నది. విదేశాలకు దీటుగా అతి సునిశిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకొని, అందిపుచ్చుకోవడంలో మన రాష్ట్ర రాజధాని ప్రథమ శ్రేణిలో నిలువబోతున్నది.
భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటం మన రాష్ర్టానికి కలిసివచ్చే అంశం. మన బలాబలాలను అంచనా వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వ్యూహాలను రూపొందిస్తున్నది. మొబిలిటీ వ్యాలీతో సహా ఏది తలపెట్టినా భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావటానికి కారణం- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే. సులభ వాణిజ్య విధానంతోపాటు విద్యుత్తు, రహదారులు తదితర మౌలిక వసతులను, ప్రోత్సాహకాలను కల్పిస్తున్నది. అన్నిటికీ మించి విద్వేషాలు చెలరేగకుండా సామాజిక సామరస్యాన్ని పరిరక్షిస్తున్నది. విద్యుత్ వాహనాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. తొలుత కొన్న లక్షలాది విద్యుత్ వాహనాలకు పన్నుల మినహాయింపు ఇవ్వడమైనా, ఫార్ములా ఈ-రేస్ నిర్వహించడమైనా ఇందులో భాగమే. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల భారీ ఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని యువత గ్రహించి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి.