అగ్రరాజ్యం అమెరికాలో బియ్యం కొరత పతాక స్థాయికి చేరింది. దీంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ‘అన్నమో రామచంద్రా’ అనుకొనే పరిస్థితి వచ్చింది. దుకాణాల్లో బియ్యం సంచులు కనిపించడం లేదు. కొన్ని దుకాణాల్లో బియ్యం ఉన్నప్పటికీ జనం ఎగబడి కొంటుండటంతో ధర ఇబ్బడిముబ్బడిగా పెంచి అమ్ముతున్నారు. అయినా కూడా ఎడాపెడా కొనేసి ఇండ్లల్లో దాచుకుంటున్నారని రేషన్ తరహాలో ఒకరికి ఒక సంచీ అనే లెక్కన ఇస్తున్నారు. ఈ కొరత రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరుతున్నట్టు అంచనా. ఇది అమెరికాకే పరిమితమైన సంక్షోభం కాదు. కెనడాలోనూ, యూరప్లోనూ బియ్యం కొరత వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలోని 140కి పైగా దేశాలకు భారత్ బియ్యం ఎగుమతి చేస్తుంది. గతేడాది 2.22 కోట్ల టన్నుల బియ్యాన్ని మన దేశం ప్రపంచానికి విక్రయించింది. యావత్తు ప్రపంచ దిగుమతుల్లో ఇది సుమారు 40 శాతం దాకా ఉంటుంది. అందులో సింహభాగం బాస్మతియేతర సన్నబియ్యమే. ఆ సన్నబియ్యానికి అలవాటు పడ్డవారికే ఇప్పుడు చిక్కులు వచ్చిపడ్డాయి.
కేంద్రం ఇటీవల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ అనాలోచిత చర్య ప్రకంపనలు దేశదేశాల్లో కనిపిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం సరఫరా ఉండదని తెలిసిన వెంటనే మార్కెట్ గందరగోళంగా తయారైంది. వాతావరణ పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల గోధుమలకు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పైగా స్థానిక అవసరాల దృష్ట్యా మనదేశం గోధుమల ఎగుమతిని ఇదివరకే నిలిపివేసింది. తాజాగా బియ్యాన్ని అమ్మబోమని తేల్చిచెప్పింది. ప్రపంచంలో గోధుమల కొరతకు ఇప్పుడు బియ్యం కొరత తోడైంది. నిరుడు రికార్డు స్థాయిలో బియ్యం దిగుబడులు వచ్చినా ఈ ఏడాది పరిస్థితి కొంత మారింది. వానలు వెనుకాముందూ కావడం వల్ల పంటనష్టాలు తలెత్తాయి. దిగుబడిపైనా దిగులు ఏర్పడింది. కేంద్రం బియ్యం ఎగుమతిని నిషేధించడానికి ఇవే కారణం. ముందుచూపు లేని మోదీ సర్కారు ఇష్టారాజ్య విధానాలు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే బియ్యం కొరతకు దారితీస్తున్నాయి. ఏడాదిన్నర కిందట మా బియ్యం కొనాలని తెలంగాణ అడిగితే మా దగ్గర నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయని కేంద్రం డాంబికాలు పలికింది. గోదాముల్లో ఖాళీ లేదని బుకాయించింది. తాజాగా అదే కేంద్రం తిరగకుండానే నిల్వలు లేవని చేతులెత్తేస్తున్నది. పేదలకిచ్చే ‘అన్నభాగ్య’కు బియ్యం లేవంటూ కార్పొరేట్లకు ఇథనాల్ తయారీ కోసం అడ్డికి పావుశేరు కింద బియ్యం అప్పనంగా ఇస్తున్నది.
వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని ముందుకు సాగకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. తెలంగాణ దగ్గర కొనం.. కర్ణాటకకు అమ్మం. బియ్యం విషయంలో కేంద్రం తీరు ఆ విధంగా ఉంది. బియ్యం ఉత్పత్తిలో అంగలు వేస్తున్న తెలంగాణ వంటి రాష్ర్టాలను ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహ పర్చడమే పనిగా పెట్టుకున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను సతాయించడం తప్ప సరైన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న సూచనలు కనిపించడం లేదు.