అణ్వాయుధాల తగ్గింపు (న్యూ స్టార్ట్) ఒప్పందం నుంచి వైదొలగుతామని రష్యా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన పలు ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో ‘న్యూ స్టార్ట్’ చివరిది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఉండవలసిన ఆయుధాల పరిమితిని నిర్దేశించడమే కాకుండా, పరస్పర తనిఖీలకు కూడా అవకాశం కల్పించింది. కరోనా కాలంలో తనిఖీలు నిలిచిపోయినప్పటికీ, పరస్పర నమ్మకం నిలిచే ఉన్నది.
కానీ ఇప్పుడు తనిఖీలకు, ఒప్పందం పొడగింపునకు రష్యా సహకరించడం లేదని అమెరికా దౌత్యవేత్తలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు రష్యా లాంఛనంగా ప్రకటించడం గమనార్హం. ఈ ఒప్పందం నుంచి రష్యా విరమించుకోవడంతో ఇక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాల కాలం ముగిసిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంటే వివిధ దేశాలు పరస్పరం భయంతో బతుకవలసిన పాత కాలానికి మళ్లీ తలుపులు తెరిచినట్టే.
అణ్వాయుధ నియంత్రణపై కట్టుబాట్లు చెదిరిపోవడమే కాదు, మొత్తం అంతర్జాతీయ వ్యవస్థనే కుదేలైనట్టు కనిపిస్తున్నది. ఐక్యరాజ్యసమితి కూడా నామమాత్రమై పోయింది. ఉక్రెయిన్ యుద్ధమే ఇందుకు ఉదాహరణ. గతంలోనూ కొన్ని సందర్భాల్లో నిస్సహాయంగా నిలిచినప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి పోషించిన పాత్ర విస్మరించలేనిది. కొన్ని దశాబ్దాల పాటు అది సమష్టి భద్రతను కల్పించగలిగింది. సోవియెట్ యూనియన్ కూలిపోయిన అనంతరం అమెరికా ఆధిపత్యంలో ఏకధ్రువ ప్రపం చం ఏర్పడటం, ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ శక్తుల ప్రాబ ల్యం పెరగడం తదితర కారణాల వల్ల విలువలతో కూడిన వ్యవస్థ పతనం మొదలైంది. కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్టుగా మారింది. బలహీన దేశాలకు రక్షణ లేకుండాపోయింది.
మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్ వైఖరి ఎట్లా ఉండాలనేది ఒక ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనప్పటికీ, మన దేశానికి భద్రతా మండలిలో స్థానం లేదు. ఈ దిశగా మనవంతు ప్రయత్నాలు చేయాలి. అయితే మండలిలో స్థానం లభించినా, బలమైన దేశమైతే తప్ప దానిని ఉపయోగించుకొని నెగ్గుకురావడం సాధ్యం కాదు. జర్మనీ భద్రతా మండలి సభ్యత్వం లేకున్నా తనవంతుగా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నది. అందువల్ల భారత్ అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలి. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలి. మన ప్రయోజనాలకు అనుగుణమైన స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తూ, ఐక్యరాజ్యసమితిని పటిష్ఠం చేయడానికి భావ సారూప్యం గల దేశాలతో సమష్టి కృషి జరుపాలి.