రువాండా.. ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. జనాభా కోటిన్నర ఉండదు. అటువంటి దేశం 1994లో జాతిపరమైన విద్వేషంలో కూరుకుపోయి భయంకరమైన హత్యాకాండ చోటు చేసుకుంది. కేవలం 100 రోజుల్లో దాదాపు 8 లక్షల మంది టుట్సీ జాతి ప్రజలు మరణించారు. యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. రువాండా అంతర్మథనంలో పడింది. మరోసారి ఇటువంటిది జరగవద్దని భావించి.. దేశాన్ని శాంతిధామంగా మలచాలనుకుంది. రెండు దశాబ్దాలు గడిచాయి. నేడు రువాండా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించటం. ప్రపంచంలోనే చట్టసభల్లో అత్యధికంగా (61 శాతం) మహిళలు ఉన్న దేశం రువాండా. జనాభాలో సగమైన స్త్రీలకు పాలనలో పగ్గాలు అప్పగిస్తే.. విధ్వంస దేశాన్ని సైతం నందనవనంగా మార్చగలరని చెప్పటానికి రువాండానే ఒక ఉదాహరణ. అనేక దేశాలు రువాండా నుంచి స్ఫూర్తి పొందాల్సి ఉంది. ఎందుకంటే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల చట్టసభల్లో స్త్రీల వాటా 24 శాతం లోపే.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది కానీ, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం సగం కాదుకదా.. మూడోవంతు కూడా ఉండటం లేదు. లోక్సభలో మరీ దిగదిడుపుగా 14 శాతమే వారి వాటా. 140 కోట్ల జనాభాలో 70 కోట్ల మంది స్త్రీలు. చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? లోక్సభలో, శాసనసభల్లో మూడోవంతు స్థానాలను అతివలకు అందించే మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏండ్లుగా పెండింగులోనే పడి ఉన్నది. 1996లో తొలిసారి ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ, ఆమోదం పొందలేదు. ఆ తర్వాత అనేక మార్లు మళ్లీ చర్చకు వచ్చింది. ఎట్టకేలకు 2010లో రాజ్యసభ ఆమోదముద్ర వేసింది కానీ, లోక్సభలో ఎప్పటిలాగే అడ్డంకి ఎదురైంది. 2014లో 15వ లోక్సభ రద్దుతో బిల్లు కూడా వీగిపోయింది. కాంగ్రెస్ హయాం ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో కూడా బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడేలా అధికారపార్టీ ఎటువంటి ప్రయత్నాలు జరుపలేదు.
మహిళా సాధికారత విషయంలో మోదీ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. నారీశక్తి, బేటీ పడావో బేటీ బచావో వంటి ఆకర్షణీయమై న నినాదాలను తీసుకొచ్చింది కానీ, ఆచరణలో ఆమడదూరంలో ఉం ది. లోక్సభలో, రాజ్యసభలో ఇప్పుడు ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. దానిని అడ్డం పెట్టుకొని వివాదాస్పద సాగు చట్టాలను రైతుల మీద రుద్దింది. కానీ, మహిళా బిల్లును మాత్రం ముందుకు తీసుకురావటం లేదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న భారత జాగృతి సారథి కవిత డిమాండ్ సమంజసమైనది. మహిళా బిల్లుకు బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తి మద్దతు ప్రకటించింది. మహిళలకు అవకాశం కల్పిస్తే పురుషులకు సీట్లు తగ్గుతాయన్న ఆందోళన పార్టీలకు ఉంటే.. చట్టసభల్లో 33 శాతం మేర సీట్లు పెంచి, వాటిని స్త్రీలకు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని కూడా కేం ద్రానికి సూచించారు. మోదీ ఇకనైనా ఈ బిల్లుపై మౌనం వీడాలి. మహిళాభ్యున్నతి పట్ల మాటలు మాని, చేతల్లో చిత్తశుద్ధిని చాటుకోవాలి.