భారత సంతతికి చెందిన మేఘా రాజగోపాలన్కు క్షేత్రస్థాయి పరిశోధనాత్మక జర్నలిజం కథనాలకు గాను అమెరికా ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు లభించింది. లండన్ కేంద్రంగా అంతర్జాతీయ రిపోర్టర్గా పనిచేస్తున్న మేఘకు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లిం మైనారిటీలపై సాగుతున్న దమనకాండ, అక్రమ నిర్బంధాల గురించి రాసిన కథనాలకు ఈ పులిట్జర్ అవార్డు దక్కింది.
మేఘా రాజగోపాలన్కు తోడుగా మరిద్దరు న్యూస్ కాంట్రిబ్యూటర్లు అలైసన్ కైలింగ్, క్రిష్టో బష్చెక్ సహాయకులుగా పనిచేశారు. వీరిద్దరూ ఈ పరిశోధనాత్మక కథనం రాయటంలో సాంకేతికంగా సహాయపడ్డారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి బయటి వారినెవరినీ చైనా ప్రభుత్వం అనుమతించదు. అక్కడి పరిస్థితులను చూడనివ్వదు, అక్కడి వారితో మాట్లాడనివ్వదు. కాబట్టి అక్కడి భౌగోళిక ఫొటోగ్రాఫ్లను వేలాదిగా పరిశీలించి, అధ్యయనం చేసి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేశారు.
మేఘా రాజగోపాలన్ చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతాన్ని సందర్శించటానికి ప్రయత్నిస్తే ఆమె వీసాను రద్దుచేసి దేశం విడిచివెళ్లాలని ఆదేశించారు. దీంతో ఆమె పొరుగు దేశమైన కజకిస్థాన్కు వెళ్లి అక్కడ కాందీశీకులుగా ఉన్న చైనీయులను కలిసింది. ఆ కాందీశీకుల్లో గతంలో జిన్జియాంగ్ నిర్బంధ శిబిరాల్లో గడిపిన డజన్ల మందిని కలిసి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నది. అక్కడ ఎంత భయానక పరిస్థితులున్నాయో, మానవ హక్కుల అణచివేత ఏ స్థాయిలో జరుగుతున్నదో నేరుగా బాధితులనుంచే విన్నది. అక్కడ ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల మీద పెద్ద ఎత్తున అణిచివేత సాగటమే కాదు, మానవ హననం జరుగుతున్నదని తెలిసివచ్చింది. వాటినే ఆమె ‘బజ్ఫీడ్ న్యూస్’ తరఫున వార్తాకథనాలను రాసింది. నిజానికి మేఘా రాజగోపాలన్ 2017లోనే చైనా జిన్జియాంగ్ ప్రాంతంలోని నిర్బంధ శిబిరాలను సందర్శించింది. ఈ నిర్బంధ శిబిరాలకు చేరుకుని ప్రత్యక్షంగా చూసిన మొదటి జర్నలిస్ట్ బహుశా మేఘానే.
జిన్జియాంగ్ ప్రాంతం అలస్కా ఖండంకన్నా విశాలమైనది. శాటిలైట్ ఫొటోగ్రాఫ్లు, 50వేల డేటా బేస్ ఆనవాళ్లను బట్టి అక్కడ 260 అతిపెద్ద నిర్మాణాలున్నాయి. వాటన్నింటిని వారు నిర్బంధ శిబిరాలుగా వినియోగిస్తున్నారు. వాటిలో చైనాలోని ముస్లిం సమాజానికి చెందిన వీగర్లు, కజక్లు లక్షలాదిగా నిర్బంధింపబడి కడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్క నిర్బంధ శిబిరంలో పదివేల మంది నిర్బంధింపబడి ఉన్నారు. ఈ నిర్బంధ క్యాంపుల్లో వారితో పనిచేయించటానికి అక్కడ ప్రత్యేకమైన పరిశ్రమలను చైనా ప్రభుత్వం నెలకొల్పి నిర్బంధంగా పనిచేయిస్తున్నది. అక్కడ వారికి కనీస మానవ హక్కులనేవే లేవు.
మేఘా రాజగోపాలన్ గురించి..
మేఘా రాజగోపాలన్ లండన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పాత్రికేయురాలు. ఆమెకు చైనా, థాయిలాండ్, అఫ్ఘానిస్థాన్ సహా ప్రపంచంలోని 23 దేశాల్లో పరిశోధనాత్మక జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉన్నది. గతంలో రాయిటర్ సంస్థలో పొలిటికల్ కరస్పాండెంట్గా పనిచేశారు.
పశ్చిమదేశాల నుంచి జిన్జియాంగ్ సందర్శించిన మొదటి జర్నలిస్ట్గా పులిట్జర్ ఆమెను కొనియాడింది. దీనికిగాను ఆమెకు 2018లో హ్యూమన్ రైట్స్ ప్రెస్ అవార్డ్ లభించింది. 2019లో శ్రీలంక హింస, ఫేస్బుక్ మధ్య ఉన్న సంబంధం గురించిన వాస్తవాలు వెలుగులోకి తెచ్చినందుకు ఆమెకు మిర్రర్ అవార్డ్ దక్కింది.