బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ విస్ఫోటనం ఫలితంగా కార్యక్రమాల రూపసారాల్లో పెనుమార్పులు రావడం సహజం. కొత్తగా ఏ మాధ్యమం వచ్చినా దానిపై తగిన నియంత్రణ ఉండాలనే విషయంలో సమాజంలో ఏకాభిప్రాయం ఉంటుంది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థలో అది అవసరం కూడా. అయితే ఆ నియంత్రణ ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉండాలనేది వివాదాస్పదమవుతున్నది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓటీటీ చట్టం ముసాయిదా విషయంలోనూ అదే జరిగింది.
కాలం చెల్లిపోయిన కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నియంత్రణ చట్టం (1995) స్థానంలో కొత్త చట్టం తీసుకురావాల్నని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు అని పేరు పెట్టారు. ‘సులభ వాణిజ్యం’, ‘సులభ జీవన విధానం’ అనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ గొప్పగా చెప్పుకొన్నారు. కానీ వాస్తవంలో ‘బిల్లు సులభ నియంత్రణ’, ‘సులభ క్రమబద్ధీకరణ’ లక్ష్యంగా రూపొందించారని విమర్శలు రావడం గమనార్హం. మీడియా నియంత్రణ విషయంలో బీజేపీ రికార్డు ఏమంత బాగా లేకపోవడం ఈ విమర్శలకు ఊతం ఇస్తున్నది. విభజించి పాలించు అనే మతోన్మాద ఎజెండాతో మీడియాను గుప్పిట్లోకి తీసుకునేందుకు బీజేపీ సర్కారు పావులు కదపడం తెలిసిందే. అయితే వాటికి దేశభద్రత, ప్రజా సామరస్యం అనే అందమైన ముసుగులు వేస్తున్నది.
2021 ఐటీ నిబంధనలపై చెలరేగిన వివాదం ఈ సందర్భంగా గుర్తుకురాక మానదు. ఇంటర్నెట్ నుంచి పోస్టులను తొలగించే అధికారం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అధికారులకు కల్పించడం వల్ల ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రతిపాదిత చట్టం ముసాయిదాలోనూ ఇదే తరహాలో ఓ నిబంధనను చేర్చడం ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడిస్తున్నది. రకరకాల అంశాలతో పాటుగా మత సామరస్యానికి భంగకరంగా ఉండే కంటెంటును తొలగించే అధికారం పరిపాలనా వ్యవస్థలో భాగమైన అధికారికి ఇవ్వడమనేది ఇక్కడా ఉంది. ఇలాంటి నిబంధనలను ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. దేశ ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలను కలగాపులగం చేసి పబ్బం గడుపుకొనే ధోరణి మంచిది కాదు. రెండింటి మధ్య విభజన రేఖను గుర్తిస్తే గానీ, ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ఎలాంటి మీడియా నియంత్రణ గురించైనా ఆలోచించే ముందు దీన్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సిందే.