కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తిరిగితే వారిపై ఏ మచ్చా ఉండదు. ‘నోరు మూసుకోకపోతే మీ ఇంటికి ఈడీ వస్తుందని’ విపక్ష సభ్యులను ఓ బీజేపీ ఎంపీ బాహాటంగా హెచ్చరించిన సంగతి విది తమే. మరోవైపు ‘బీజేపీలో చేరాను నాకు ఇక దాడుల భయం ఉండదని’ గోడదూకిన ఓ విపక్ష నేత అనడమూ తెలుసు. ఇది ఇప్పటిదాకా జరిగిన తతంగం. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఓటమి భయంతో బీజేపీ సర్కారు వికృత చేష్టలకు తెగిస్తున్నది. హడావుడిగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం వంటి తాయిలాల మాట సరేసరి.
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ యంత్రాంగాన్నే ప్రచారానికి వినియోగించుకునేందుకు ఒడిగట్టింది. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడానికి అధికారులను దేశమంతటా రథ ప్రభారీలుగా అంటే ప్రచార ఇంచార్జీలుగా కేంద్రం నియమించింది. వారు జిల్లాల్లో కేంద్రం గత తొమ్మిదేండ్ల పాలనలో సాధించిన విజయాలంటూ ప్రచారం సాగిస్తారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రభుత్వాలు కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ ప్రకటనలు విడుదల చేయడం సాధారణమే. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘భారత్ వెలిగిపోతోందంటూ’ బీజేపీ నేతృత్వంలోని అప్పటి కేంద్ర సర్కారు పెద్దఎత్తున మీడియాలో ప్రచారోద్యమం నిర్వహించింది. కానీ, ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూడటం గమనార్హం. ఇప్పుడు మోదీ సర్కారు ఒకడుగు ముందుకు వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకునేందుకు తెగించింది.
నవంబర్ 25 నుంచి వచ్చే జనవరి 25 వరకు ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ జరుగుతుందని, దేశంలోని మొత్తం 765 జిల్లాల్లో ఆ ప్రచార యాత్ర పర్యవేక్షణకు అధికారులను కేటాయించాలని కేంద్రం గత 17న జారీచేసిన సర్క్యులర్పై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. రథప్రభారీలు, అంటే స్పెషల్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రచార బాకాలూదాలనేది దాని సారాంశం. ఇది ఎన్నికల అవసరాలకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపర్చడం తప్ప మరోటి కాదని, సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల సంఘానికి లేఖలూ రాశాయి. ఆదర్శ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత జారీచేసిన ఈ సర్క్యులర్ చెల్లదని మాజీ ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ సర్కారు తొమ్మిదేండ్ల విజయాలను పక్కనపెడితే అపజయాలను ప్రజలకు ఎవరూ వివరించాల్సిన అవసరం లేదు. ధరల పెరుగుదల, నోట్లరద్దు, ఉపాధి కల్పనలో తీవ్ర వైఫల్యం, జీఎస్టీ బాదుడు, వ్యవసాయ నల్లచట్టాలు, మహిళలపై అత్యాచారాలు, ప్రజల మధ్య చీలికలు తెచ్చి మతోన్మాదానికి ఆజ్యం పోయడం వంటి మోదీ పాలన ఫలితాలను ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది పసిగట్టిన కేంద్రం ప్రచార హోరు పెంచాలని చూస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సైన్యాన్ని కూడా వాడుకోవడానికి తెగబడటం ఈ ధోరణికి పరాకాష్ఠ. దీర్ఘకాలికంగా దేశంపై ప్రభావం చూపే ఇలాంటి అడ్డూ అదుపూ లేని చర్యలకు దిగజారడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిఖార్సయిన పనిమంతులెవరో, ఉత్తుత్తి ప్రచారంతో వ్యక్తిపూజా దురాచారానికి పాల్పడేదెవరో వారికి తెలుసు. సకాలంలో సరైన తీర్పు వెలువరించి నిగ్గుతేల్చేది ప్రజలే.