పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్కు రెండురోజుల ముందుగానే బుధవారం ముగిశాయి. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. రాజ్యసభలోనూ అంతంత మాత్రమే. అంటే, కనీసం ఒక్కరోజు (24 గంటలు) కూడా ఉభయసభలు పూర్తిగా నడవలేదు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అటువంటిది ప్రజాస్వామ్యానికి కేంద్రస్థానమైన పార్లమెంటులో ఈ పరిస్థితులు నెలకొనటం అత్యంత దురదృష్టకరం. అధికార, విపక్షాల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందనటానికి ఇది నిదర్శనంగా ఉంది.
వర్షాకాల సమావేశాలు గత నెల 19న ప్రారంభమైంది మొదలు ఏ ఒక్కరోజూ సజావుగా నడవలేదు. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ వైఫల్యం, వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం, ఎన్నడూలేనివిధంగా రూ.100 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు మొదలైన అంశాలపై అప్పటికే విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతలోనే ‘పెగాసస్’ రూపంలో వాటికో బ్రహ్మాస్త్రం లభించింది. దేశంలోని పలువురు ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఎన్నికల సంఘం మాజీ కమిషనర్… చివరికి ఇద్దరు కేంద్రమంత్రులపై కూడా ఈ స్పైవేర్ సాయంతో నిఘా పెట్టారని మీడియాలో వెల్లడి కావటం సంచలనం సృష్టించింది. యావత్ విపక్షం దీనిపై భగ్గుమన్నది. ఈ అంశం మీద చర్చించాలని ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సభా కార్యకలాపాలను రోజుల తరబడి ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ వారిపై మోదీ సర్కార్ ఆరోపణలకు దిగిందిగానీ పెగాసస్పై చర్చకు మాత్రం ముందుకురాలేదు.
పెగాసస్ వ్యవహారం చాలా తీవ్రమైనది. పలుదేశాల్లో ప్రభుత్వాలు దీనిపై దర్యాప్తునకు చర్యలు చేపట్టాయి. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆ స్పైవేర్ను తయారుచేసే ఇజ్రాయెల్ సంస్థతో ఎటువంటి లావాదేవీలు జరపలేదంటూ రక్షణశాఖ సహాయమంత్రిచే ఒక చిన్న ప్రకటన చేయించి ఊరుకుంది. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం కొంత దిగిరావలసింది. తనకున్న మెజారిటీతో పలు బిల్లులపై చర్చ అన్నదే లేకుండా సభ ‘ఆమోదముద్ర’ వేయించుకున్నది. మూడువారాల సమావేశాల్లో ఒకే ఒక ఓదార్పు- ఓబీసీ బిల్లు మీద ఉభయ పక్షాలు చర్చలు జరిపి ఆమోదించడం. పార్లమెంటు కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోవటంపై ఉభయ సభాపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడుకోవటం అధికార, విపక్షాల బాధ్యత. ఇకమీదటైనా అన్ని పక్షాలూ దానిని గుర్తెరిగి ప్రవర్తించాలి.