ఓడమల్లయ్యను దువ్వి పనిచేయించుకోవాలె. అవతలి గట్టుకు చేరుకున్న తర్వాత బోడమల్లయ్య అంటూ తీసి అవతల పారెయ్యాల నేది కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుసరిస్తున్న నీతి. ఇందులో సీఎం రేవంత్రెడ్డి రెండాకులు ఎక్కువే చదివారన్న సంగతి ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అన్నివర్గాలకు అన్నీ అంటూ అందరికీ టోపీలు పెట్టిన సర్కార్ తాజాగా వాహనదారుల మెడపై కత్తిని వేలాడదీస్తున్నది. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పిల్లలు తెలిసో తెల్వకో తాగితే డ్రంక్ డ్రైవ్ అని నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి, వాని బండి గుంజుకుని, పోలీస్ స్టేషన్ల పెట్టి వాని వీపు పగుల గొట్టి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు.. ఇవీ ఆనాడు రేవంత్ మాటలు. ట్రాపిక్ ఉల్లంఘనలు పెద్ద నేరమా? అన్నట్టు మాట్లాడి యువతను టార్గెట్ చేసుకుని తెగ సానుభూతి ఒలకబోశారు. ఆటోవాలాలకు చలాన్లు వేసి వారి జేబుల్ని దోచుకోవడం ఏమిటని ఎగిరెగిరి పడ్డారు. తమకు అధికారమిస్తే ఆటోవాలాలకు చలాన్లపై రాయితీ ఇస్తామని ఆశపెట్టారు కూడా. అదంతా నిజమని కొందరు నమ్మారేమో. కానీ ఆ సానుభూతి అంతా ఓట్లు దండుకోవడానికి ఆడిన నాటకమని తేలిపోయింది. ఇప్పుడు జేబులకు కాదు, ఏకంగా ఖాతాలకే చిల్లు పెట్టే ఎత్తుగడకు తెరతీశారు. ఆటోడెబిట్ అనే ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
మూల మలుపుల్లో మాటువేసి బండ్లను ఆపి, చలానా కట్టమని ట్రాఫిక్ పోలీసులు వేధించడం మనం చూస్తుంటాం. వాహనాల తాళాలు తీసేసుకుని మరీ ఇబ్బంది పెడుతారు. వాహనదారులను రోడ్ల మీద వేధించడం కుదరదని మొన్నకు మొన్న జనవరి 20న హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. పౌరులు జరిమానాలను తమ ఎంపిక మేరకు కట్టుకోవచ్చు. పోలీసులు చట్టబద్ధమైన క్రమాన్ని పాటించితీరాలని స్పష్టం చేసింది. కావాలంటే కోర్టు నోటీసులు పంపాలని సూచించింది. కానీ ఖాతాల నుంచే కట్ చేసుకుంటామని సీఎం రేవంత్ అంటున్నారు. అనడమే కాదు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాయితీలు కల్పిస్తామని ఇచ్చిన మాటను తప్పి, ఏ వాహనం పైనై నా చలానా వేస్తే పైసా తగ్గించకండి. వాహనం యజమాని బ్యాంకు ఖాతాను ట్రాఫిక్ డిపార్టుమెంటుకు అనుసంధానం చేసి గోళ్లూడకొట్టి వసూలు చేయండి అని అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అధికారులు కూడా ఖాతా వివరాలిస్తేనే వాహన రిజిస్ట్రేషన్ అనే నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఇది హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందనేది పైకి తెలుస్తూనే ఉంది. రోడ్డు మీద వాహనాలు ఆపి జరిమానాలు వసూలు చేయవద్దని ఓవైపు హైకోర్టు అంటుంటే ఖాతాకే కన్నం పెట్టాలని చూడటం ఏమిటో!
సంపద పెంచడం, ప్రజలకు పంచడం చేతగాక తక్షణం సర్కారు ఆదాయం పెంచుకునేందుకు రేవంత్ నిస్పృహతో ఈ మార్గం ఎంచుకున్నారనేది తెలిసిపోతున్నది. ఆ సంగతి అలా ఉంచితే అసలు ’ఆటో డెబిట్’ అనేది ఆచరణ సాధ్యమా అనే చర్చ కూడా నడుస్తున్నది. అత్యవసర పని మీద వెళ్తున్న వ్యక్తి చిన్న ఉల్లంఘనకు పాల్పడితే, అవసరం కోసం పెట్టుకున్న డబ్బు చలానాల కింద ఎగిరిపోతే అతడి పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న. ట్రాఫిక్ ఉల్లంఘనల సమస్య అసలు మూలాలను వదిలేసి జరిమానాల పేరిట వసూళ్ల దందా మొదలుపెట్టడం ఏమిటని ప్రజలు మం డిపడుతున్నారు. ప్రమాదాలకు, ఉల్లంఘనలకు కేవలం వాహనదారుని బాధ్యుని చేయలేము. వాహనదారుని స్పష్టమైన అనుమతి లేకుండా ఖాతాల నుంచి సొమ్ము లాగేసుకోవడం వల్ల ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. సైబర్ నేరగాళ్లకు దీనివల్ల అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇప్పటికే ఫేక్ చలాన్ చెల్లింపుల బెడద తలనొప్పిగా మారింది. పైగా బ్యాంకు లింకేజీకి చట్టపరమైన అవరోధాలు చాలానే ఉంటాయన్న సంగతి బహుశా రేవంత్కు తెలిసినట్టు లేదు. అవకాశవాద హామీలతో అధికారం చేజిక్కించుకుని నరకం చూపిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా ఎవరి ఖాతాల్లోనైనా సొమ్ము జమ చేయవచ్చు. కానీ ఇతరులు ఆ ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం దాదాపు అసాధ్యం.. అది ప్రభుత్వం అయినప్పటికీ! ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు వివిధ పథకాల కింద సొమ్ము ఖాతాల్లో వేస్తే, ఖాతాల నుంచి సొమ్ము లాగేసుకునేందుకు నడమంత్రపు కాంగ్రెస్ సర్కారు ఎగబడుతుండటం విచారకరం. మోసపోయి గోసపడుతున్న ప్రజ లు కేవలం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని గెలిపించిన ఆ ఓట్లతోనే తిరగబడి విరగబోట్లు పొడుస్తారు. తస్మాత్ జాగ్రత్త.