‘జేపీ మోర్గాన్కు హైదరాబాద్ ఒక కీలకమైన ఆర్థిక, టెక్నాలజీ హబ్. భారతదేశానికి సంబంధించి మా కంపెనీ అభివృద్ధిగాథలో ఈ నగరం విడదీయలేని భాగం’- హైదరాబాద్లో 8.2 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో నిర్మించిన తమ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా జేపీ మోర్గాన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డానియల్ విల్కెనింగ్ చేసిన ఈ వ్యాఖ్య మన రాష్ట్ర రాజధాని స్థాయి ఏమిటో మరోమారు చాటిచెప్పింది. అమెజాన్, ఆపిల్, గూగుల్, ఐకియా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకే కాదు, కొత్త కలలు కంటూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్న వేలాది స్టార్టప్లకు వేదికగా నిలుస్తున్న మహా నగరం ఇది. ఆసియా పసిఫిక్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ హబ్లలో ఒకటి మన భాగ్యనగరం. ఈ ప్రగతి పరుగు ఎప్పటికప్పుడు కొత్త వేగాన్ని సంతరించుకుంటున్నది. దీనికి ప్రధాన కారణాలు-అత్యంత అనుకూలమైన పారిశ్రామిక విధానం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, అందుబాటులో మానవ వనరులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం.
రాష్ట్రం ఏర్పాటైన 2014లో తెలంగాణ నుంచి రూ.57,258 కోట్ల విలువైన ఐటీ సేవలు ఎగుమతి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఈ ఎగుమతుల విలువ రూ.1.4 లక్షల కోట్లకు చేరుకున్నది. అంటే ఏడేండ్లలో 244 శాతం అభివృద్ధి. ఫలితంగా కొన్నివేల మంది ప్రత్యక్షంగా, లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతికి తార్కాణాలు ఈ గణాంకాలు. సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో రచించిన ప్రణాళికలు ఒకవైపు, పెట్టుబడిదారులను, కంపెనీల అధిపతులను స్వయంగా ఒప్పించి, మెప్పించి రాష్ర్టానికి తీసుకురావటానికి ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ చేస్తున్న కృషి మరోవైపు- ఈ ఉమ్మడి కార్యాచరణ వల్లనే కళ్లు చెదిరే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.
ఐటీ కంపెనీలు ఒక్క హైదరాబాద్కే, అందులోనూ హైటెక్ సిటీ, గచ్చిబౌలికే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం మంచి ఫలితాలను ఇస్తున్నది. గ్రిడ్ పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యేలా రాయితీలు అందించటం వల్లనే నేడు నగరం నలువైపులా వృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలోని ఇతర నగరాలకూ ఐటీ విప్లవాన్ని విస్తరించటానికి నడుం కట్టిన ప్రభుత్వం కరీంనగర్ తదితర జిల్లాల్లో ఐటీ టవర్లను ప్రారంభించింది. పారిశ్రామిక ప్రగతిని ఐటీకే పరిమితం చేయకుండా ఇతర రంగాలకూ పెద్దపీట వేస్తున్నది. బంగారు, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్ను రూ.750 కోట్ల పెట్టుబడితో నెలకొల్పటానికి ప్రఖ్యాత జ్యుయలరీ సంస్థ మలబార్ ముందుకురావటం దీనికి తార్కాణం. అభివృద్ధి వికేంద్రీకరణతో సంపద వికేంద్రీకరణ జరుగుతుందనే సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆచరించటం హర్షణీయం.