చదువు ఎవరికైనా గర్వకారణం. మన చదువుకు కొలమానం డిగ్రీ. ఎవరైనా తమకున్న డిగ్రీలను గొప్పగా ప్రదర్శించుకుంటారు. నలుగురికీ తెలుపాలనుకుంటారు. పాత రోజుల్లోనైతే డిగ్రీ సర్టిఫికెట్లను ఫొటో ఫ్రేమ్ కట్టి ఇంటిలో గోడకు వేలాడదీసేవారు. డిగ్రీలపై గోప్యతను చూపటం అరుదు. అందులోనూ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చదువును దాచుకోవటం దేశ చరిత్రలోనే లేదు. ప్రైవేటుగా ఎలా ఉన్నా, పబ్లిక్లో నిలబడితే మాత్రం తప్పకుండా ప్రశ్నిస్తామని శ్రీశ్రీ అన్నట్లుగా.. తమకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల, నేతల విద్యార్హతలు తెలుసుకోవాలనుకోవటం ప్రజలకు ఉన్న హక్కు. అందులోనూ ఈ దేశ అత్యున్నత పదవిలో ఉండే ప్రధాని గురించి ఆసక్తి మరింత ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలోనే మోదీ చేసిన పోస్ట్గ్రాడ్యుయేషన్ (పీజీ) వివరాలు కావాలంటూ అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు కమిషన్కు దరఖాస్తు చేశారు. వివరాలివ్వాలని సీఐసీ గుజరాత్ వర్సిటీని ఆదేశించింది. సమాచారం ఇవ్వటం కుదరదంటూ వర్సిటీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లగా, హైకోర్టు వర్సిటీకి అనుకూలంగా తీర్పునివ్వటమేగాక కేజ్రీవాల్పై రూ.25 వేల జరిమానా విధించింది.
రైల్వే స్టేషన్లో టీ అమ్మటం దగ్గరినుంచి తన జీవితంలో జరిగిన వివిధ ఘటనల గురించి, తన సాధారణ నేపథ్యం గురించి మోదీ, ఆయన పార్టీ నేతలు ప్రజలకు అనేకసార్లు కథలు కథలుగా చెప్తుంటారు. ఆ మాటల్లో నిజమెంత ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే మాత్రం స్వయంగా మోదీ నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ ఎటువంటి సహకారం లభించకపోగా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఒపెన్ లెర్నింగ్ నుంచి 1978లో బీఏ చేశానని మోదీ గతంలో వెల్లడించారు. ఆ వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం ప్రకారం 2016లో ఒక విలేకరి దరఖాస్తు చేస్తే.. యూనివర్సిటీ అధికారులు వెల్లడించలేదు. పాత రికార్డులను తనిఖీ చేసి, వివరాలు ఇవ్వాలంటూ వర్సిటీని నాటి కేంద్ర సమాచార కమిషనర్ ఆదేశించారు. దానిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
ప్రజాస్వామ్యానికి పారదర్శకత ఒక ముఖ్య షరతు. మోదీ హయాంలో ప్రభుత్వ పాలనలో పారదర్శకత క్రమేణా హరించుకుపోతున్నది. నిధులు వనరులు ఇవ్వకుండా, అమలులో అడ్డంకులను సృష్టించటం ద్వారా సమాచార చట్టాన్ని దాదాపుగా నిర్వీర్యపరిచారు. సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాలని సమాచార హక్కు చట్టం చెప్తుంటే, సమాచారం అడిగిన వారిపైనే జరిమానా విధించే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ‘ఇంత దాపరికం వెనుక ఉన్న కారణాలేమిటి? అయితే, మోదీ ఇగోనైనా కావచ్చు. లేదంటే ఆ సర్టిఫికెట్ నకిలీదైనా కావచ్చు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చూడటానికి చిన్న అంశంగా కనిపించవచ్చు కానీ, దేశంలో తరిగిపోతున్న ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనంగా ఉందీ వివాదం. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దితే తప్ప ప్రజాస్వామ్యంపై భరోసా నిలబడదేమో!