జన్మభూమి అయోధ్యలో రామ్లల్లా ‘విరాజ్మాన్’ కావడం దేశ ప్రజలందరికీ పెద్దపండుగ. ముఖ్యంగా రామభక్తులు, హిందువుల్లో ఉత్సాహం మిన్నంటుతున్నది. దేశవ్యాప్తంగా ఊరూరా రామోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం మనం చూశాం. దేశాన్ని శతాబ్దాల పాటు కుదిపేసిన ఒక మహావివాదం అయోధ్యలో ఆలయ నిర్మాణంతో ఓ కొలిక్కి వచ్చినట్టయింది. అయోధ్య సమస్యకు పరిష్కారంతో దేశవ్యాప్తంగా ఇక సయోధ్య నెలకొంటుందని ఆశించడంలో తప్పులేదు. ఈ సందర్భంగా రామరాజ్యం అనే మాట పదేపదే వినిపిస్తున్నది. నిజానికి ఆ మాటను పదేపదే ఉచ్చరించిన మహాత్ముడు ‘రఘుపతి రాఘవ రాజారాం.. ఈశ్వర్ అల్లా తేరేనామ్’ అని ప్రార్థించేవారు. దీనినే స్ఫూర్తిగా తీసుకొని దేశపెద్దలు మతసామరస్యం బలంగా వేళ్లూనుకునేందుకు కృషి చేయాలి. రామరాజ్యం అంటే ప్రజలను చల్లగా చూసే పాలన అనే భావన ఈ దేశంలో నాటుకుపోయింది. అది నిజం కావాలని దేశం వెయ్యికండ్లతో ఎదురుచూస్తున్నది.
రామునికి అయోధ్యలో ఆలయం నిర్మితమవడం అనేది కొంచెం ముందూవెనుకా జరగాల్సిన పనే. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామరస్యంగా ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండాల్సింది. కానీ, కొన్ని చారిత్రక కారణాల వల్ల అది జరగలేదు. ఫలితంగా అదొక వివాదమై కూర్చున్నది. విభజన నరమేధం నేపథ్యంలో స్వాతంత్య్రం రావడం వంటి కారణాల వల్ల ఈ సమస్యను అప్పటి పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. పైగా వైషమ్యాలకు దారి తీస్తుందని కూడా వారు భావించి ఉండవచ్చు. గత 30 ఏండ్లుగా అయోధ్య వివాదం ప్రముఖంగా ముందుకురావడం, రాజకీయాల్లో నిర్ణయాత్మక అంశంగా మారడం చరిత్ర. ఇటీవల కొందరు మైనారిటీ మేధావులు అంటున్నట్టు కొద్దిలో తేలాల్సిన సమస్య సర్దుబాట్లు జరగని కారణంగా బిగదీసుకుపోయింది. మొత్తం మీద సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో సమస్య ఓ కొలిక్కి వచ్చి వివాదాల టెంటులోంచి రామచంద్రుడు బయటపడి భవ్యమైన కోవెలలోకి చేరడం అందరికీ సంతోషం కలిగించే విషయమే. బాలరాముని చల్లని చూపులు దేశానికి శాంతి, సౌభాగ్యాలు తేవాలని అందరం కోరుకుందాం. అయోధ్య ఆలయం-రామయ్య ఒక ఆధ్యాత్మిక అంశం, భక్తి భావన.
అయితే గుడిలో రామయ్య కొలువుదీరిన వేళ అక్కడ జరిగిన ప్రసంగాల్లో రాజకీయం తొంగిచూడటం అంత సబబుగా అనిపించలేదు. ఆధ్యాత్మికం వేరు, రాజకీయం వేరు. ప్రజలు కోరుకున్నది రాముడిని, రాజకీయాలను కాదు. గుడి చుట్టూ అల్లుకున్న నినాదాలకు, వివాదాలకు కాలం చెల్లిందని అర్థం చేసుకోవాలి. అభివృద్ధిపై దృష్టి సారించి అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తేనే అది నిజమైన రామరాజ్యం అవుతుంది. ఇందుకు ముందుగా చేయాల్సింది దేశంలో బుసలు కొడుతున్న విద్వేషాలను పాతిపెట్టడం. మనిషిని మనిషి హింసించే అమానుషత్వాన్ని పారదోలడం. ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్’ అన్న కవివాక్కులు నిజం కావాల్సిన తరుణమిది. పేదలను దరిద్ర నారాయణులని దైవభావంతో చూసే సంస్కారం మనది. మానవసేవే మాధవసేవ అని నమ్మిన రోజే నిజమైన రామరాజ్యం సాకారమైనట్టు!