రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన మరోమారు తెలంగాణకు పెట్టుబడుల వరదను పారించింది. కేవలం 15 రోజులలో రూ.36,000 కోట్ల ఎంవోయూలను కేటీఆర్ సాధించుకొచ్చారు. వివిధ కంపెనీలు ఇచ్చిన హామీలతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా 42 వేల ఉద్యోగావకాశాలు కొత్తగా ఉనికిలోకి రానున్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బ్రిటన్కు చెందిన అతిపెద్ద ఆర్థిక సేవల కంపెనీ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, ప్రపంచంలోనే భారీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్ట్రేట్స్ట్రీట్, వినోద రంగంలో దిగ్గజం వార్నర్ బ్రదర్స్ వంటివి తెలంగాణకు తరలి రావటం మన రాష్ట్ర పారిశ్రామిక విధానానికి, మంత్రి కేటీఆర్ కృషికి లభించిన గౌరవం. రానున్న కంపెనీలు రాజధాని హైదరాబాద్కు మాత్రమే పరిమితం కావటం లేదు. కరీంనగర్, వరంగల్, నల్గొండ తదితర పట్టణాలలో విభాగాల ఏర్పాటుకు కొన్ని కంపెనీలు అంగీకరించాయి. అభివృద్ధి ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, తెలంగాణ అంతటా దాని ఫలాలు అందుబాటులోకి వస్తున్నాయి.
తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు ఉన్న అపారమైన అభివృద్ధి అవకాశాలను విశదీకరించే తీరు, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకునే విధానం, అద్భుతమైన వాగ్ధాటి, ఆంగ్లభాష నైపుణ్యం.. ఇవన్నీ కేటీఆర్ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మలిచాయి. మన దేశంలోని సాధారణ రాజకీయ నాయకులకు భిన్నమైన శైలి ఆయనది. తన నియోజకవర్గమైన సిరిసిల్లకు వెళ్తే అక్కడి ప్రజల్లో ఒకరిగా మసలుకుంటారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ప్రజెంటేషన్ ఇస్తే ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓలా మాట్లాడుతారు. మనుష్యులు నీళ్లలా, ఏ పాత్రలో పోస్తే దాని రూపంలో ఒదిగిపోయినట్లుగా ఉండాలని బ్రూస్లీ అంటాడు. కేటీఆర్లో అదే కనిపిస్తుంది. అందుకనే, ఆనంద్ మహీంద్ర నుంచి అజీం ప్రేమ్జీ వరకూ అందరూ ఆయనను ప్రశంసించిన వారే. గత ఏడాది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో కేటీఆర్ను ప్రత్యక్షంగా చూసిన ప్రముఖ వెంచర్ కాపిటలిస్ట్ ఆశా జడేజా మోత్వానీ ‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే, ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’ అంటూ ట్వీట్ చేశారు.
స్వరాష్ర్టాన్ని సాధించుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభవేళ.. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతం కావటం సంతోషాన్ని మరింత పెంచుతున్నది. ఇది తెలంగాణ సత్తాను చాటుతున్న సందర్భం. తెలంగాణ రాకముందు, కరెంటు వెతలతో హైదరాబాద్లోని పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యజమానులు తమ ఫ్యాక్టరీల్లోని యంత్రాలను తుక్కు కింద అమ్ముకున్న దుస్థితి ఉండేది. అటువంటి హైదరాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, టీఎస్-ఐపాస్ వంటి వినూత్నమైన విధానాలతో నేడు పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. తొమ్మిదేండ్ల స్వల్పవ్యవధిలో చోటుచేసుకున్న విప్లవం ఇది. కాబట్టే, తెలంగాణ మాడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.