అంతరిక్ష పరిశోధనలో దూకుడుగా వెళ్తున్న భారత్ మరో కీలక మైలురాయిని దాటబోతున్నది. ఇప్పటివరకు మానవరహిత ప్రయోగాలపైనే దృష్టిసారించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మానవ సహిత యాత్రల దిశగా అడుగులు వేస్తున్నది. నలుగురు వ్యోమగాములు రోదసి మీదకు లంఘించబోతున్నారు. గగన్యాన్ పేరిట ఇస్రో చేపట్టనున్న అంతరిక్షయాత్రలో పాల్గొనే వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశ్ శుక్లాల పేర్లు తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినప్పుడు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
భూ కక్ష్యలోకి ముగ్గురు సభ్యుల వ్యోమగామి బృందాన్ని పంపేందుకు గగన్యాన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇస్రో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదే అత్యంత ఖరీదైనదని చెప్పాలి. ఇప్పటిదాకా సొంత రాకెట్లతో సొంత వ్యోమనౌకల్లో సొంత పౌరులను అంతరిక్షంలోకి పంపిన దేశాలు మూడే మూడు. అవి రష్యా, అమెరికా, చైనా. అగ్రరాజ్యాలు అంతరిక్షపోటీలో ముందుండటం సహజమే. అయితే చైనా ఇటీవలే, అంటే 2023లో మాత్రమే ఆ ఘనత సాధించింది. ఇప్పుడు భారత్ ఆ మూడు దేశాల సరసన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించబోతున్నది.
ఇప్పటివరకు కేవలం ఐదుగురు భారతీయ పౌరులు లేదా భారత సంతతి వ్యక్తులు మాత్రమే అంతరిక్ష యాత్ర జరిపారు. అవన్నీ కూడా విదేశీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగినవే. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి దూసుకుపోయిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో అంతరిక్షం నుంచి జరిపిన టెలిఫోన్ సంభాషణ ప్రసిద్ధి పొందింది. భారత్ అంతరిక్షం నుంచి ఎలా కనిపిస్తున్నది అని ప్రధాని అడిగితే శర్మ ‘సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా’ అని సమాధానం ఇవ్వడం విశేషం.
అయితే ఆయన ప్రయాణించిన సోయుజ్ సోవియెట్ యూనియన్ అంతరిక్ష సంస్థకు చెందినది. ఉభయదేశాల ఉమ్మడి యాత్రగా ప్రచారం జరిగినప్పటికీ అది పూర్తిగా సోవియట్ ప్రయోగమేనని చెప్పాలి. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యోమనౌకల్లో అమెరికా పౌరులుగా అంతరిక్షయాత్రలు జరిపారు. చారి తెలుగువాడు కావడం గమనార్హం. మరో తెలుగు వ్యోమగామి శిరీష బండ్ల భూకక్ష్య దిగువ వరకు వర్జిన్ అనే ప్రైవేటు సంస్థ తరపున (సబ్ ఆర్బిటల్) అంతరిక్షయాత్ర జరిపింది. ఇప్పుడు భారత వ్యోమనౌకలో, ఇస్రో ఆధ్వర్యంలో యాత్రకు నలుగురు శిక్షణ పొందుతుండటం మన దేశానికి గర్వకారణం.
అయితే ప్రధాని మోదీ ప్రకటించిన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నది. భారతీయ పతాకచ్ఛాయలో చేపడుతున్న తొలి వ్యోమయాత్రలో ఒక్క మహిళా లేకపోవడమేమిటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మన అంతరిక్ష కార్యక్రమ విజయంలో అగ్రగామి పాత్ర పోషిస్తున్నది మహిళలే అన్న విషయం మరచిపోరాదు. అయితే అంతరిక్ష యాత్రికులు వైమానిక దళ టెస్ట్ పైలట్లు అయి ఉండాలన్న నిబంధన వారి ఎంపికకు అడ్డువస్తున్నదని అంటున్నారు. ఈ అడ్డంకి కూడా త్వరలో తొలగిపోవాలని ఆశిద్దాం. భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ తిరుగులేని విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.