నిరంకుశ, ప్రతీకార రాజకీయానికి పరాకాష్ఠ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటే మహారాష్ట్రలో ఏక్నాథ్షిండేకు లభించినట్లుగా సిసోడియాకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి లభించి ఉండేది. కానీ ఆయన తన పార్టీకి, తన అధినేతకు ద్రోహం చేయదల్చుకోలేదు. విధేయుడిగా ఉన్నారు. విలువలకు కట్టుబడి ఉన్నారు. కాబట్టే జైలు పాలయ్యారు. ఆయన ఇంటిలో సీబీఐ గంటల తరబడి సోదాలు జరిపినా కూడా ఎటువంటి అనుమానాస్పద పత్రాలను కానీ, సొమ్మునుగానీ జప్తు చేయలేకపోయింది. తమ ‘మద్యం విధానం’లో ఎంతమాత్రమూ అవినీతి జరుగలేదని, ఢిల్లీలో తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేకే కేంద్రం ఈ కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటికి రేపే జైలు నుంచి విడుదల కారా? అన్న కేజ్రీవాల్ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే.
గౌతమ్ అదానీ కుంభకోణంతో దేశంలోని స్టాక్మార్కెట్లు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. ఆయన కంపెనీల్లో వాటాలు కొన్న కోట్ల మంది చిన్న పెట్టుబడిదారులు రాత్రికి రాత్రి బికారులయ్యారు. అంతర్జాతీయంగా దేశం పరువు పోయింది. భారతీయ స్టాక్మార్కెట్లలో పెట్టుబడులు పెట్టటానికి అంతర్జాతీయ సంస్థలు పునరాలోచిస్తున్నాయి. దీనిపై యావత్ ప్రతిపక్షం భగ్గుమంటున్నది. అయినా కూడా పార్లమెంటులో ప్రధాని మోదీ నోరు విప్పరు. ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన అయినా రాదు. ఇటువంటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొందాం అని ఓ అఖిలపక్ష భేటీనైనా జరుపరు. ప్రతిపక్ష నేతలపై పనికి మాలిన ఆరోపణలు వచ్చినా కూడా వెంటపడే దర్యాప్తు సంస్థలు ఇంత జరిగినా అదానీని కనీసం ప్రశ్నించవు. కేంద్రప్రభుత్వం ఇంతటి పక్షపాతంతో, ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించటం స్వతంత్ర భారతదేశంలో తొలిసారి చూస్తున్నాం.
ఇందిరాగాంధీ హయాంలో వ్యవస్థల దుర్వినియోగం జరిగిందని, దేశ చరిత్రలో అదొక చీకటి అధ్యాయం అని చెప్పుకొంటాం. కానీ, ప్రస్తుత పరిస్థితి దానిని మించి పోయింది. ఇందిర ‘ఎమర్జెన్సీ’ అని ప్రకటించి నిరంకుశత్వాన్ని నెలకొల్పారు. కానీ, ఇప్పుడు చాప కింద నీరులా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. సకల వ్యవస్థలనూ చెరబట్టటం, మీడియాను కోరలు పీకేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటం, న్యాయవ్యవస్థ తమ నియంత్రణలో లేకపోవటంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, ఏకంగా సుప్రీంకోర్టు ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలు జరుపటం, ప్రజల మధ్య మతచిచ్చు లేపి ఓట్లు రాల్చుకోవటం.. దిగజారుడుతనం విశ్వరూపం దాల్చినట్లుగా ఉంది. కేంద్రంలో అధికారం ఉంది కదా అన్న అహంకారంతో బీజేపీ కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్నది. తమకు ఎదురే లేదనుకున్న నియంతలకు ఆఖరికి ఎటువంటి గతి పట్టిందో చరిత్ర చదువుకున్న వారందరికీ తెలుసు. బీజేపీకి కూడా ఆ గుణపాఠం ఈ దేశం కచ్చితంగా నేర్పుతుంది. భారతదేశం ఎవరికీ, ఎన్నటికీ తలవంచదు.