స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో భిన్న శక్తులు, సంస్థల మధ్య పోటీ ఉండటం సాధారణం. ఈ స్వేచ్ఛా క్రీడలో ప్రభుత్వం తటస్థంగా ఉండాలి. నిబంధనల ప్రకారం పోటీ పడే అవకాశం కల్పించాలి. అంతేతప్ప ఆశ్రిత పక్షపాతం చూపకూడదు. కానీ ప్రధాని మోదీ అధికారానికి వచ్చిన తరువాత ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలు దేశాన్ని దాటి వ్యాపించాయి. గౌతమ్ అదానీకి సంబంధించి ఇటువంటి కళ్లు చెదిరే విషయాలను అమెరికాకు చెందిన ప్రఖ్యాత వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల వెల్లడించడం ఇందుకు ఉదాహరణ. ఈ ఎనిమిదేండ్లలో మోదీ విదేశీ పర్యటనలు జరిపిన వెంటనే ఆయా దేశాలలో అదానీ గ్రూపునకు భారీ కాంట్రాక్టులు లభించటం కాకతాళీయం అనుకోలేము. ప్రధాని మోదీ స్వయంగా ఒత్తిడి తేవటం వల్లనే అదానీకి కాంట్రాక్టు ఇచ్చామని శ్రీలంక విద్యుత్శాఖ ఉన్నతాధికారే ఆ మధ్య వెల్లడించారు.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతోపాటు ప్రధాని మోదీ గత ఎనిమిదేండ్ల కాలంలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు యావత్తు ఆర్థిక వేత్తల విమర్శలకు గురవుతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన భారీ సంస్థలను అప్పనంగా ప్రైవేటుకు అప్పగించడం తీవ్ర అభ్యంతరకరం. దేశంలో మౌలిక వసతులు కల్పించడంలోనూ, పారిశ్రామికాభివృద్ధిలోనూ కీలకపాత్ర వహించిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ను ప్రైవేటీకరించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. రైల్వే మొదలుకొని ఓడరేవుల వరకు అన్నీ ప్రైవేటు దాహానికి బలైపోతున్నాయి. ప్రధానిగా రాష్ర్టాల మధ్య పక్షపాతం లేకుండా వ్యవహరించడానికి బదులు సొంత రాష్ట్రమైన గుజరాత్ పట్ల మొగ్గు చూపడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. బీజేపీయేతర పక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడం కూడా సమంజసం కాదు. భిన్న జాతులు, భాషలు, జాతులు ఉన్న దేశం ఇంతకాలం సమైక్యంగా మనగలిగింది అంటే ఇటువంటి విభజన భావజాలానికి స్థానం లేకపోవడం వల్లనే.
ప్రైవేటు రంగానికి పన్నుల రాయితీలు ఇస్తూ, ఆస్తులను అప్పగిస్తున్న మోదీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పట్ల మాత్రం కనికరం చూపడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింది. పెద్ద నోట్ల రద్దు, హఠాత్తుగా లౌక్డౌన్ వంటి నిర్ణయాల వల్ల జన జీవనం అతలాకుతలమైంది. మోదీ అనుసరిస్తున్న జీఎస్టీ విధానం కూడా పేదల వ్యతిరేకమైనదే. దీనికి తోడు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కుట్రపూరితమైన ప్రచారం సాగిస్తున్నారు. మోదీ విధానాల వల్ల ఆర్థిక అసమానతలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, కేంద్ర రాష్ర్టాల మధ్య అపనమ్మకాలు పెరిగిపోతే సంక్షోభాలు తలెత్తుతాయి. మోదీ పోకడలకు తక్షణం అడ్డుకట్ట వేస్తేనే మన ప్రజాస్వామిక వ్యవస్థ మనగలుగుతుంది.