రుతువులు గతితప్పుతున్నాయి. ప్రకృతి ప్రకోపం శృతిమించుతున్నది. ఉత్తరాదిలో వర్షాలు ఉత్పాతం సృష్టిస్తుంటే దక్షిణాదిలో చినుకులు వెనుకాడుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఢిల్లీలో మహా కుంభవృష్టి కురిసింది. ఎండావానల దొంగాట కేవలం భారత్కు పరిమితమైన వ్యవహారం కాదు. యావత్తు భూగోళమే కకావికలమవుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. స్పెయిన్ కరువు కోరల్లో విలవిలలాడుతున్నది. అమెరికా, చైనాలో ఎండలు మండుతున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియా, పశ్చిమ రష్యా, పశ్చిమ అమెరికా అధిక చలితో వణుకుతున్నా యి. ఎల్నినో అనే అగ్గికి మానవ కల్పితమైన వాతావరణ మార్పు అనే ఆజ్యం తోడు కావడం వల్ల జరుగుతున్న వైపరీత్యం, విధ్వంసం ఇదంతా. సాగర గర్భంలోని వేడిమి బయటకు రావడం అనే ప్రక్రియకే ఎల్నినో అని పేరు. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్నినో ఈసారి చుక్కలు చూపిస్తున్నది.
ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు పైపైకి పోతాయి. దక్షిణ అమెరికాలో భారీవర్షాలు కురుస్తాయి. ఆఫ్రికాలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి. ఆసియాలో ఈసరికే ఉష్ణతాపం ప్రభావం చూపిస్తున్నది. ఇవీ గతితప్పిన ఎల్నినో గురించి వాతావరణ నిపుణులు స్థూలంగా వెల్లడిస్తున్న సంగతులు. వీటివల్ల ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి నిర్వహణ, అంతిమంగా పర్యావరణంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. 2023, 2024లలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వాతావరణ మార్పు చేయిదాటి పోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ నొక్కిచెప్పడం గమనార్హం.
ఎల్నినో ఒకసారి విజృంభిస్తే దాని ప్రభావం కొన్నేండ్లపాటు ఉంటుంది. గతంలో 1982-83లో, 1997-98లో ఎల్నినో పెచ్చరిల్లింది. మొదటి దానివల్ల 4.1 లక్షల కోట్లు, రెండో దానివల్ల 5.7 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కతేల్చారు. అదే సమయంలో భారత్కు వాటివల్ల జీడీపీలో 3 శాతం, 1.5 శాతం నష్టాలు వాటిల్లాయి. ఎల్నినో నష్టాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలపైనే అధిక ప్రభావం చూపిస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ ఏడాది కూడా ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచానికి పర్యావరణ నష్టాలే కాకుండా ఆర్థిక నష్టాలూ దాపురిస్తాయి. ముఖ్యంగా ఆహార, పర్యాటక, చిల్లర వర్తకం దెబ్బతింటాయని చెప్పవచ్చు. 2029 నాటికి ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ఈ నష్టాలు మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటాయని ఒక అంచనా. ఓ వైపు వాతావరణ మార్పులకు కారణమైన ఉద్గారాలను తగ్గించేందుకు, అదే సమయంలో పేద ప్రజలపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.