దేశవ్యాప్తంగా విపక్ష నేతల యాపిల్ ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరికలు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వం తమపై ఓ కన్నేసి ఉంచిందని, తమ ఫోన్ల సంభాషణలు చెవియొగ్గి వింటున్నదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పోషణలో ఉన్న హ్యాకర్లు మీ ఫోన్లలోని సమాచారాన్ని దొంగిలించ జూస్తున్నారన్న’ హెచ్చరికలు పలువురు విపక్ష ఎంపీలకు, నేతలకు వచ్చాయి. దాంతో వారు తమపై ప్రభుత్వం నిఘా వేస్తున్నదని ఆరోపించారు. శశి థరూర్, మహువా మొయిత్రా తదితరులు ఎక్స్లో ఆ సందేశాలను పోస్టు చేశారు. కొందరు నేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు కూడా. యాపిల్ హెచ్చరికలు రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరంతరం విమర్శించే ‘ది వైర్’ వెబ్సైట్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్దార్థ వరదరాజన్కు కూడా యాపిల్ సందేశం రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తాజా హ్యాకింగ్ ఉదంతంతో డిజిటల్ ప్రపంచంలో గోప్యత, ప్రభుత్వ పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘ప్రభుత్వ పోషణ’లోని అనే మాటపై యాపిల్ కంపెనీ వివరణ ఇస్తూ, ‘హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినప్పుడు యాంత్రికంగా అలాంటి సందేశాలు వెళ్తాయని, ఇదమిద్దంగా ఫలానా ప్రభుత్వమని చెప్పలేమని’ పేర్కొనడం గమనార్హం. అంటే భారత ప్రభుత్వ పాత్ర ఉందో లేదో తెలియదని తప్పించుకోవడమన్న మాట. వేరే దేశాల ప్రభుత్వాలకు ఇక్కడి విపక్ష నేతల సమాచారం రాబట్టుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. నిన్న గాక మొన్న పెగాసస్ స్పైవేర్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 50 వేల పైచిలుకు ఫోన్లపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాంకేతిక కమిటీ దర్యాప్తు కూడా జరిగింది. ఆ దర్యాప్తులో ప్రభుత్వం సరిగా సహకరించలేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇప్పటికీ పెగాసస్ వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయిందన్నది గుర్తుంచుకోవాలి.
ఈ నేపథ్యంలో యాపిల్ హ్యాకింగ్ సందేశాలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కుటిల రాజకీయాలు చేస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్ష నేతలపైకి ఉసిగొల్పడం, దర్యాప్తు పేరిట, కేసులపేరిట వేధింపులకు గురిచేయడం గురించి అనునిత్యం వింటూనే ఉన్నాం. దేశ పరిస్థితులు ఎమర్జెన్సీ రోజుల కన్నా ఘోరంగా తయారయ్యాయని విపక్షాలు ధ్వజమెత్తడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రమైనదిగా పరిగణిస్తున్నదని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. నిజానికి ఇదేదో బీజేపీ సర్కారుకే పరిమితమైన అంశమని భావించడానికి వీల్లేదు. విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని చెప్పాలి. రెండు పార్టీలు చేసుకున్న పరస్పర ఆరోపణలే ఈ సంగతిని వెల్లడిస్తున్నాయి.