నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు నేతలు తమదైన ముద్ర వేస్తారు. వారి ప్రభావం పదవిలో ఉన్నప్పుడే కాదు.. ఆ పదవిని వీడి వెళ్లిన తర్వాత కూడా కొనసాగుతుంది. సమకాలీన ప్రపంచ రాజకీయాలకు సంబంధించి అటువంటివారిలో జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఒకరు. గత పదహారేండ్లుగా, వరుసగా నాలుగు పర్యాయాలు జర్మనీ అధినాయకురాలిగా సేవలందించిన మెర్కెల్ మరోసారి ఆ పదవిని చేపట్టబోనని ప్రకటించి ఇటీవలి ఎన్నికల నుంచి తప్పుకోవటంతో ఆ దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయ్యింది. 2005లో మెర్కెల్ తొలిసారి అధికారం చేపట్టేనాటికి జర్మనీని ‘యూరప్ రోగగ్రస్థ దేశం’ అని పిలిచేవారు. అటువంటి జర్మనీని మెర్కెల్ ‘యూరప్ సూపర్ పవర్’గా మార్చారంటే ఆమె సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత ఎన్నికల్లో మెర్కెల్ పార్టీ కన్జర్వేటివ్లకు గానీ, మరో ప్రధాన పార్టీ అయిన సోషల్ డెమోక్రాట్లకు(ఎస్పీడీ)గానీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. స్వల్ప ఆధిక్యం ఉన్న ఎస్పీడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. ఏదోవిధంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనా మెర్కెల్ స్థాయి నాయకత్వాన్ని జర్మనీకి, యూరప్కు ఆ ప్రభుత్వం అందించగలదా అన్నది కీలకమైన ప్రశ్న. జర్మనీ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడిన ఆర్థికవ్యవస్థ. మెర్కెల్ హయాంలో ఆ దేశం ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీని వెనక్కినెట్టి యూరప్లో నెంబర్వన్గా నిలిచింది. మరోవైపు ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవటం వంటి సంక్షిష్ట సమయంలో మెర్కెల్ సంక్షోభ పరిష్కర్తగా వ్యవహరించారు. యూరప్ దేశాల్లో శక్తిమంతమైన నాయకురాలిగా, ఈయూకు పెద్దదిక్కుగా నిలిచారు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై నియంతృత్వ తరహా పోకడలకు పోతున్న తరుణంలో ‘స్వేచ్ఛా ప్రపంచపు నాయకురాలు’గా మెర్కెల్ ప్రజాస్వామ్య ప్రియులలో ఆశను సజీవంగా నిలుపగలిగారు. ఈ వారసత్వాన్ని కొనసాగించటం జర్మనీ కొత్త ప్రభుత్వానికి సవాలే.
జర్మనీతో భారత్కు ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. జర్మనీ ‘క్యాబినెట్ స్థాయి అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు’ (ఐజీసీ) జరిపే కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. 2001 నుంచీ ఇప్పటివరకూ ఐదు ఐజీసీలు జరిగాయి. కృత్రిమ మేధ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అనుకూల ఇంధనాలు, స్మార్ట్సిటీలు వంటి రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతున్నది. ఐరాస భద్రతామండలిలో సంస్కరణలు జరుపాలన్న మన డిమాండ్కు జర్మనీ కూడా గట్టి మద్దతిస్తున్నది. కొత్త ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత కూడా జర్మనీతో ఈ స్నేహసంబంధాలను కొనసాగిస్తూనే రక్షణ, ఉన్నత విద్య, ఆధునిక టెక్నాలజీలు వంటి ఇతర రంగాలకూ సహకారాన్ని విస్తరించుకోవాలి. తద్వారా యూరప్లో అగ్రరాజ్యమైన జర్మనీతో స్నేహాన్ని సుస్థిరపర్చుకోవటంలోనే భారత్ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.