ఖతార్ జైలు నుంచి ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులు విడుదల కావడం భారతదేశానికి దౌత్యపరంగా లభించిన ఘన విజయంగా చెప్పాలి. వారు మృత్యువు అంచులదాకా వెళ్లిన సంగతి తెలిసిందే. గూఢచర్యం కేసులో పట్టుబడ్డ ఆ ఎనిమిది మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. 2022 ఆగస్టు 30న ఆ దేశ రాజధాని దోహా నగరంలో ఖతార్ గూఢచార సంస్థ వారిని అరెస్టు చేసింది. అరెస్టు అయినవారిలో కమాండర్ సుగుణాకర్ పాకాల విశాఖపట్నానికి చెందిన తెలుగువాడు. గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసిన తీరు, రహస్యంగా విచారణ జరిపిన కారణంగా గూఢచర్యం కేసు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై భారత్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం భారత్కు దౌత్యపరంగా పెద్ద సవాలుగా మారింది.
అధికారికంగా ఆరోపణలు వెల్లడించనప్పటికీ ఇజ్రాయెల్కు వారు రక్షణ రహస్యాలు చేరవేశారని మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఖతార్తో సహా పశ్చిమాసియాలోని ఏ ముస్లిం దేశానికైనా ఇజ్రాయెల్ బద్ధ శత్రువు. ఖతార్లో రక్షణ సంబంధ సంస్థలో కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న ఆ ఎనిమిది మందిని అధికారులు హడావుడిగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎనిమిదిసార్లు బెయిల్ దరఖాస్తులు న్యాయస్థానాల తిరస్కారానికి గురయ్యాయి. కేసు వివరాలు ఏవీ బయటకు రాలేదు. విచారణ పూర్తిగా తెరవెనుకే జరిగింది. గతేడాది మార్చిలో విచారణ ప్రారంభం కాగా.. అక్టోబర్లో నిందితులందరికీ మరణశిక్ష విధించినట్టు పిడుగుపాటు లాంటి వార్త వెలువడింది. నిందితులు భారత నౌకాదళంలో ఉన్నత పదవులు నిర్వహించిన వ్యక్తులు. వారికి కోర్టు విధించిన శిక్ష అమలైతే ఆవేదన కలగడంతో పాటుగా అంతర్జాతీయంగా తలవంపులు కలుగుతాయి. దీంతో వారిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ దౌత్యపరంగా, న్యాయపరంగా చర్యలు చేపట్టింది.
గత డిసెంబర్లో దుబాయ్లో జరిగిన కాప్- 28 వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఖతార్ అమీర్ అల్ థానీతో ప్రధాని నరేంద్ర మోదీ విడిగా సమావేశమయ్యారు. అధికారిక సమాచారం లేనప్పటికీ నేవీ అధికారుల కేసుపై వారు చర్చించి ఉంటారని మీడియా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే నెల మరణశిక్షలను కారాగారవాస శిక్షలుగా మార్చినట్టు సమాచారం వెలువడింది. తాజాగా వారి శిక్షలు రద్దు చేసి విడుదల చేశారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది. భారత విదేశాంగ శాఖ కూడా నిందితులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడం కొసమెరుపు. ఈ కేసు భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో భారత్కు పెరుగుతున్న పలుకుబడికి ఈ కేసు అద్దం పడుతున్నది.