అదొక జాతీయపార్టీ. అందులోనూ ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారం నెరపుతున్న రాజకీయపక్షం. అటువంటి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే.. దేశ భవిష్యత్తుకు సంబంధించి గానీ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజానీకం సంక్షేమం గురించిగానీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని, తద్వారా తమ సంకల్పాన్ని చాటుకుంటారని ఆశిస్తాం. కానీ బీజేపీ నుంచి అటువంటిది ఆశించటం కూడా అత్యాశే అవుతుందని ఈ సమావేశాలు మరోమా రు నిరూపించాయి. అధికారదాహం, అడ్డగోలు మాటలు, నాయకుడిపై పొగడ్తలు, విపక్షాలపై, మేధావులపై ఆరోపణలు.. ఇదే ప్రహసనం ఇక్కడా కొనసాగింది.
భారతదేశం ఒక జాతిగా కుప్పకూలిపోయే దారుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ బీజేపీ సమావేశాలకు కేవలం ఒకరోజు ముందు ఎంతో ఆవేదనతో మాట్లాడారు. దేశంలో పెచ్చరిల్లుతున్న మతోన్మాదాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై కేంద్రం దమనకాండను చూసి ఆయన ఆ మాటన్నారు. నిజంగా బీజేపీకి నిజాయితీ ఉంటే.. అంతటి మేధావి అలా వ్యాఖ్యానించటానికి దారి తీసిన పరిస్థితులను, దాంట్లో తన పాత్రను విశ్లేషించుకొని, జాతికి సమాధానం చెప్పాలి. కానీ, ఆ పార్టీ నుంచి అంతటి ఔన్నత్యాన్ని ఆశించటం అంటే.. ఎండమావుల వెంట పరిగెత్తినట్లే. ‘మోదీజీ! పొరుగున ఉన్న చైనా 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరిస్తే, మనమింకా 3.1 ట్రిలియన్లను కూడా ఎందుకు దాటటం లేదు? శ్రీలంకలో అదానీ తరఫు సేల్స్మన్లాగా మీరు ఎందుకు వ్యవహరించారు? ట్రంప్ కోసం అమెరికాలో ప్రచారం చేయటం ఏమిటి?’.. వీటికి జవాబులు చెప్పండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే.. ఒక్కదానికీ సమాధానం చెప్పే చేవ తనకు లేదని మోదీ నిరూపించుకున్నారు.
కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ స్వోత్కర్ష చూస్తే నవ్వు రాకమానదు. మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశం గొప్ప ఆర్థికాభివృద్ధిని సాధించి, ఎంతో ఎత్తుకు ఎదిగిందట. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నదట. దేశంలోనూ సరిహద్దుల వద్దా పరిస్థితులు అత్యంత సురక్షితంగా ఉన్నాయట. అలా అయితే, దేశ చరిత్రలోనే నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఎందుకు పెరిగింది? రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి ఎందుకు పడిపోయింది? పెట్రోల్, డీజిల్ రూ.వందను, వంటగ్యాస్ రూ.వెయ్యిని ఎందుకు దాటాయి? దేశంలో అనేక ప్రాంతాల్లో మతకలహాలు ఎందుకు జరుగుతున్నాయి? గల్ఫ్ దేశాలు భారత్ను ఎందుకు మందలించాయి? చైనా ఎందుకు చొచ్చుకు రాగలిగింది? అగ్నిపథ్పై యువత ఎందుకు ఆగ్రహాన్ని ప్రదర్శించింది?.. బీజేపీ కార్యవర్గ సమావేశాల తీరు, నేతల ప్రసంగాలు గమనిస్తే, తెలంగాణలో ఏదోరకంగా అధికారంలోకి రావాలనే యావ తప్ప మరొకటి కనిపించలేదు. దశాబ్దాల వలస పాలన నుంచి విముక్తి సాధించి, అనేక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నది. దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్నది. బీజేపీ సహకరిం చాలే తప్ప, రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడటం తగదు.