తెలంగాణ అంటే తెగువ. తెలంగాణ అంటే త్యాగం. తెలంగాణ అంటే సమభావం, సహజీవనం. మలిదశ తెలంగాణ పోరాటానికి అంకురార్పణ గావించిన నాడు ఉద్యమనేత కేసీఆర్ ‘గాంధేయం నా గాండీవం’ అన్నారు. అహింసాయుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. రాష్ర్టాన్ని సాధించుకోలేమా అని ధైర్యం చెప్పారు. చివరికి ఆత్మత్యాగానికి సిద్ధపడి గమ్యాన్ని ముద్దాడారు. ఏనాడూ భౌతికదాడులకు పాల్పడమని జనాలను రెచ్చగొట్టలేదు. అందుకే తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. తెలంగాణ తెహజీబ్ను చూసి అందరూ ముచ్చటపడతారు.
రాష్ర్టాన్ని సాధించాం.. పరిపాలనకు అవకాశం ఇవ్వమని ప్రజలను కోరితే సరే అని వరమాల వేశారు. మా పాలన చూసి ఓటేయండని అడిగితే రెండోసారీ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోవంతు. అభివృద్ధి పట్టాలెక్కింది. శాంతి, సుహృద్భావం వెల్లివిరిసింది. గమ్యం చేరడానికి ఇంకా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయంటూ కేసీఆర్ ప్రజల ముందుకువెళ్లారు. త్వరలో ప్రజలు తీర్పు చెప్తారు. బీఆర్ఎస్ విజయం ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. సరిగ్గా ఈ మూల మలుపులోనే కాంగ్రెస్ కత్తి దూసింది. స్వచ్ఛమైన తెలంగాణ పాలకుండలో విషం చిమ్మింది. పచ్చగా అలరారుతున్న తెలంగాణ గడ్డ మీద అక్కసుతో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైంది.
మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరరెడ్డిపై జరిగిన దాడిని ఈ నేపథ్యంలోనే చూడాలి మనం. నిస్పృహతో జరిగిన నికృష్టమైన దాడి అది. మాకు అధికారం రాకపోతే మంటలు పెడతాం అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ తీరు. నిజానికి గతంలో సీఎంలను అస్థిరపరిచేందుకు మత కల్లోలాలు సృష్టించిన ఘన చరిత్ర ఆ పార్టీది. ఇప్పుడు అలాంటి కుటిల పన్నాగాలు సాగవు. ఇది మనసున్న మారాజుల తెలంగాణ. ఇక్కడ విషపూరిత కుట్రలకు తావులేదని కాంగ్రెస్ తెలుసుకోవాలి.
నిజానికి ధనమదంతో కూడిన కాంగ్రెస్ అక్కసు మార్కు రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. పదేండ్లుగా ప్రజలు కాంగ్రెస్ను దూరం పెట్టారు. అధికారానికి దూరమైన ఆ పార్టీ బీఆర్ఎస్పై ప్రజలు వర్షిస్తున్న అభిమానాన్ని చూసి ఈర్ష్యతో రగిలిపోతున్నది. ఆ పార్టీ నేతలు గులాబీ పాలనపై అవాకులు చెవాకులు పేలడమే పనిగా పెట్టుకున్నారు. బట్టకాల్చి మీదేసే పనులూ చేశారు. జిత్తుల స్థానంలో ఇప్పుడు కత్తులు వచ్చిచేరాయి.
ఆవేశకావేశాలు రగులుతుండిన ఉద్యమకాలంలోనూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో చోటుచేసుకోలేదు. ఇప్పుడు చల్లని పాలనలో నెత్తురు చిందింది. గాంధీభవన్లో గాడ్సేలు చేరిన ఫలితమా ఇది?సంస్కారహీనులు పెంచుతున్న విషవృక్షమా ఇది? ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు ఏ మాత్రం క్షమార్హం కావు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.