‘దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే.. సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే.. గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి..’ అంటూ మనిషి గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగుతుంది ‘బాలభారతం’లో ఘంటసాల ఆలపించిన గీతం. అంతరిక్ష రంగంలోనూ జయకేతనాన్ని ఎగురవేయటానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పేస్టెక్ ఫ్రేమ్ వర్క్’ను చూస్తే ఈ పాట స్ఫురణకు వస్తుంది. తెలంగాణ విజయప్రస్థానం కూడా సాగునీటి నుంచి మొదలై నేడు గగనసీమలను దాటి రోదసి దాకా విస్తరిస్తున్నది. దీని వెనుక కూడా ఒక మనిషి మొక్కవోని సంకల్పం, ఒక భూమి పుత్రుడి గుండె తడి, ఒక నాయకుడి దార్శనికత దాగి ఉన్నది. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసీఆర్.
కరువు కాటకాలతో తల్లడిల్లిన ఒకనాటి తెలంగాణ నేడు ఉపగ్రహాల తయారీకి కేంద్రంగా మారాలని లక్ష్యం పెట్టుకోవటం మాట్లాడుకున్నంత చిన్న విషయం కాదు. ఈ మార్పు వెనుక ఎనిమిదేండ్ల నిరంతర కృషి ఉంది. సమగ్ర కార్యాచరణ ఉంది. 15 రోజుల్లో అధికారులు అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అనుమతి లభించినట్లు భావించాలి అంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలోనే తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ను చూసి దేశవిదేశాల వ్యాపార దిగ్గజాలు తెలంగాణను ఆసక్తిగా చూడటం ప్రారంభించారు. అప్పటి నుంచీ వాళ్లిక దృష్టి మరల్చుకోకుండా తెలంగాణ ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వంతో తనను తాను ఆవిష్కరించుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే టీ-హబ్, వీ-హబ్, టాస్క్, టీ-వర్క్స్ వంటి హైటెక్ వేదికలు ఆవిర్భవించాయి. స్టార్టప్స్ స్టేట్గా తెలంగాణ గుర్తింపు పొందింది. ఐటీ ప్రపంచానికి తలమానికంగా ఉన్న విశ్వవిఖ్యాత కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయి. విమానయాన రంగంలో అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచిన బోయింగ్ కంపెనీ తన విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన విడిభాగాల తయారీకి హైదరాబాద్ను ఎంచుకుంది.
ఈ దిగ్విజయ యాత్రలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పోషిస్తున్న పాత్ర కీలకమైనది. అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ, విదేశీ పర్యటనలు జరుపుతూ, ఆన్లైన్ సమావేశాల్ని నిర్వహిస్తూ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు కేటీఆర్. ఆయన చొరవ, వాగ్దాటి పారిశ్రామికాధిపతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. కేటీఆర్పై ఇటీవల విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ చేసిన ప్రశంసలే దీనికి తాజా ఉదాహరణ. ఓవైపు అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు వేదికగా నిలుస్తూనే.. అత్యాధునిక టెక్నాలజీ ప్రయోగాలకు తెలంగాణ అండగా ఉంటున్నది. మెడిసిన్ ఫ్రమ్ స్కై, ఏరియల్ సీడింగ్, ఈ-ఓటింగ్ సొల్యూషన్స్తోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పలు రకాల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ ఉపగ్రహాల తయారీకి సైతం తనను తాను విస్తరించుకుంది. రోదసిలోనూ మన ముద్ర కనబడటం గర్వకారణం.