డబ్బులు ఇవ్వటమే కాదు.. అవి సద్వినియోగం అయ్యేలా చూడటం కూడా ముఖ్యమే. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో మాత్ర మేగాక.. రాష్ర్టానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా నిధులు మంజూరు చేయటంతోపాటు వాటి ఖర్చు ఎలా జరుగుతుందో లెక్కాపద్దు చూసే విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా నిలువటం హర్షణీయం. గ్రామపంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో రాష్ట్రం మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో 12,769 గ్రామపంచాయతీలు ఉంటే.. వాటిలో 3,636 పంచాయతీల్లో ఆడిటింగ్ పూర్తయ్యింది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన రాష్ర్టాలు (ఉత్తరప్రదేశ్-443 గ్రామపంచాయతీలు, హిమాచల్ప్రదేశ్-236 గ్రామపంచాయతీలు) తెలంగాణకు ఆమడదూరంలో ఉన్నాయి. ఇవి రెండూ బీజేపీ పాలిత రాష్ర్టాలు కావటం గమనార్హం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు అందే నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచటానికి, నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆన్లైన్ ఆడిటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పలు రాష్ర్టాలు ఈ విషయంలో పెద్దగా చొరవ చూపని దశలో.. తెలంగాణ ముందడుగు వేసింది. తొలి ఏడాదే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణలో అమలైన ఆన్లైన్ ఆడిటింగ్ ప్రక్రియను మార్గదర్శకంగా తీసుకోవాలని ఇతర రాష్ర్టాలకు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వరుసగా రెండోసారి తెలంగాణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా.. స్థానిక సంస్థలకు పెద్దపీట వేయటమే కాదు, ఆ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా? లేదా? అన్న విషయానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని దేశానికి తెలంగాణ చాటిచెప్పింది.
‘పల్లెలు దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు’ అన్న నానుడిని నిజం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను స్వయం సమృద్ధి కావించటానికి అనేక పథకాలు తీసుకొచ్చారు. పల్లెప్రగతి, హరితహారం, రైతుబంధు, ధాన్యం సేకరణ, చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో జలవనరుల, భూగర్భజలాల అభివృద్ధి, కులవృత్తులకు పునర్వైభవం వంటి సంక్షేమ చర్యలతో తెలంగాణ పల్లెలు నిజంగానే భాగ్యసీమలవుతున్నాయి. ఈ ఫలితం వెనుక ఎంతో నిశితమైన ప్రణాళిక రచన, ఆ ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా పకడ్బందీ వ్యవస్థ ఉన్నదనే విషయం.. ‘గ్రామపంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్’లో తెలంగాణ నెంబర్వన్గా నిలువటం ద్వారా మరోసారి రుజువైంది. ఐటీ వంటి హైటెక్ రంగం నుంచి మొదలుకుంటే గ్రామీణాభివృద్ధి వరకూ పలు రంగాల్లో.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశానికే తలమానికంగా ఎదుగుతూ ఉండటం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, పాలనకు లభిస్తున్న నీరాజనం.