పాలకుడికి బుద్ధి కుశలతతోపాటు సహృదయం ఉంటే సమాజానికి సంక్షేమం ఒనగూరుతుంది. ప్రజలను తనవారిగా, వారి సమస్యలను తన సమస్యలుగా భావించినప్పుడు పరిష్కార మార్గాలు లభిస్తాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆయుర్వేద ఔషధాలను కూడా వాడి చూడాలనే కేసీఆర్ వినూత్న ఆలోచనకు మూలం ఆయనలోని మానవీయ దృక్పథమే. ఇటీవల కరోనా కలవరపెడుతున్న సందర్భంలో బ్లాక్ ఫంగస్ సోకడం మరింత భయం గొలిపింది. ఈ బ్లాక్ ఫంగస్ భయానకమైంది. దీనికి మందులు కొరతగా ఉండటమే కాకుండా ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ తీవ్ర సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారాన్ని అన్వేషించారు. ఆ మథనం మూలం గా ఆయన మస్తిష్కంలోంచి ఈ సృజనాత్మక పరిష్కారం పుట్టుకొచ్చింది. సంప్రదాయ ఔషధ విధానాన్ని బ్లాక్ ఫంగస్పై ఆయుధంగా వాడాలని వైద్య నిపుణులకు సూచించారు.
సమాజాన్ని వేధిస్తున్న క్లిష్ట సమస్యకు ముఖ్యమంత్రి సరైన పరిష్కారాన్ని సూచించారనడానికి ఈ ప్రయోగంలో వెల్లడైన ఫలితాలే నిదర్శనం. అలోపతికి అనుబంధంగా ఆయుర్వేదం ఔషధాలు వాడటం వల్ల రోగులలో వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా స్వల్ప కాలంలోనే ఉపశమనం లభించిందని వైద్య నిపుణులే నిర్ధారించడం గమనార్హం. ఆయుష్ విభాగం చొరవతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కోఠీ ఈఎన్టీ, గాంధీ దవాఖానల్లో నిర్వహించిన ప్రయోగాలు కనుక సందేహించవలసిందేమీ లేదు. ఆయుర్వేదం ‘నమ్మకం’పై ఏర్పడిన చికిత్స కాదు. శతాబ్దాల తరబడి పరిశోధనలు, అనుభవాల ప్రాతిపదికగా రూపుదిద్దుకున్న వైద్య విధానం. ప్రాచీన భారతంలో గణితం, ఖగోళం వంటి విజ్ఞాన శాఖలతోపాటు ఎదిగింది. ఇంతటి వైద్య విజ్ఞానాన్ని పాశ్చాత్యులు పట్టించుకోకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ మన భారతీయ పాలకులు ఇంతకాలం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనేది ప్రశ్న. పాలకుడికి ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఇటువంటి భావనలు మొలకెత్తుతాయి.
ఏడేండ్ల స్పల్పకాలంలో కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ విధానాలను అమలు చేయగలగడానికి మూల కారణం ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రగాఢమైన మమకారం. ఆడపిల్ల పొద్దున్నే లేచి బిందె పట్టుకొని నీళ్ళ కోసం పోవడం ఆయనను కలచివేసింది. అందుకనే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇంటింటికీ పరిశుభ్రమైన నల్లా నీరు అందించారు. అదే ‘మిషన్ భగీరథ’గా ప్రఖ్యాతిపొంది విదేశీ పరిశోధకుల దృష్టిని కూడా ఆకర్షించింది. విద్యార్థులకు హాస్టళ్ళలో అన్నం, పప్పు కొలిచిపెట్టడాన్ని ఆయన సహించలేకపోయారు. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి చర్యలు తీసుకున్నారు. కల్యాణలక్ష్మి పథకమైనా, కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, తాజాగా ‘దళిత బంధు’ అయినా ప్రజల కోసం ఆయన పడే తపన నుంచి పుట్టినవే. మానవీయతే ఉత్తమ పాలకుడి సహజాతమనడానికి కేసీఆర్ ఆలోచనలు, విధానాలే తార్కాణం.