ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో బడిగంట మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల గేట్లు తెరుచుకోనున్నాయి. విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయన్న ఉత్సాహం ఒకవైపు ఉన్నా.. మరోవైపు విద్యా ప్రమాణాల పరంగా, ఆరోగ్యపరంగా మనముందు పలు సవాళ్లు నిలిచే ఉన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంటున్న విద్యాసంస్థలలో.. బోధన ప్రక్రియల్లో మార్పులు మొదలుకొని కరోనా వైరస్ ప్రబలకుండా చర్యలు చేపట్టడం వరకూ పలురకాల క్లిష్ట సమస్యలున్నాయి. వీటిని అధికారులు, విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సి ఉన్నది. ప్రతి ఒక్కరూ దీన్నొక సామాజిక సవాలుగా స్వీకరించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకొని, సమన్వయంతో పనిచేస్తేనే పరిష్కారం సాధ్యమవుతుంది.
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. డిగ్రీ ఫైనల్ పరీక్షలు ఏదో అయ్యాయనిపించారు. విద్యార్థి కెరీర్లో అత్యంత కీలకమైన పదోతరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దుచేసి ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జీరో అకడమిక్ ఇయర్ కాకుండా చర్యలు చేపట్టడం జరిగింది కానీ విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయిన దుస్థితి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి దాకా విద్యార్థులు తాము నేర్చుకున్న ప్రాథమిక విషయాలను మర్చిపోయే స్థితి ఉత్పన్నమైంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా ఆశించిన ఫలితాలు లేవని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
పాఠశాలలు, విద్యాసంస్థలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో బోధనను వినూత్న పద్ధతులలో జరుపాల్సిన అవసరం ఉన్నది. భాషా నైపుణ్యాల ఆధారంగా మొత్తం పాఠశాల విద్యార్థుల స్థాయులను గమనంలోకి తీసుకొని విద్య నేర్పాలి. గణితం, సామాన్య, సాంఘిక శాస్ర్తాల విషయంలోనూ మౌలిక భావనలు పునశ్చరణ చేస్తూ బోధించినప్పుడే ఆయా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధతో బోధన ప్రక్రియను ఖరారు చేసుకోవడం ఆవశ్యకం. మరోవైపు, కరోనా ప్రబలకుండా శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. వైరస్ నుంచి గణనీయమైన రక్షణ కల్పిస్తున్న వ్యాక్సిన్లను విద్యార్థులందరికీ వేసేలా కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. టీకాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, పంపిణీ చేసే గురుతర బాధ్యతను కేంద్రం స్వీకరించాలి. ఎన్ని పరిమితుల్లో మనం బతుకుతున్నామో కరోనా పాఠం నేర్పింది. బడిలో నేర్పే పాఠాలూ జీవితం నేర్పే పాఠాలూ రెండింటి సమాహారమే రేపటి విద్యా బోధన!