‘నాకో స్వప్నం ఉంది.. ఒకనాటి బానిసలు, యజమానుల పిల్లలమనే తేడాలేవీ లేకుండా నేటి పిల్లలందరూ సహపంకి ్తభోజనాలు చేసే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. ఒంటి రంగుతో నిమిత్తం లేకుండా మనిషి గుణాన్ని బట్టి నిర్ణయించే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. నల్లజాతి, తెల్లజాతి వివక్షలేకుండా పిల్లలందరూ సోదరీ సోదరుల్లా చేతులు కలిపే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది..’ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్టు 28న వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ దగ్గర అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. ఉపాధి కోసం, రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వాతంత్య్రం కోసం నల్లజాతి ప్రజలు కంటున్న స్వప్నాన్ని ఆయన తన చరిత్రాత్మక ప్రసంగంలో ఆవిష్కరించారు. ఇటీవల హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంలోనూ అదే ఆర్తి, అదే ఆకాంక్ష తొణికిసలాడింది. తరతరాల సామాజిక వివక్ష నుంచి దళిత జాతిని విముక్తం చేయాలన్న దృఢ నిశ్చయం ఆయనలో కనిపించింది.
దళితులను వ్యాపారకుశలురుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష కేసీఆర్ ప్రసంగంలో స్పష్టంగా వ్యక్తమైంది. దళిత ప్రభుత్వోద్యోగులతోపాటు దళితులందరికీ తోడ్పాటు అందిస్తానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. హుజూరాబాద్ ప్రయోగం అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసినప్పుడు, దళితవర్గమే కాదు, మొత్తం తెలంగాణ సమాజ స్వరూప స్వభావాలు మారిపోతాయి. కేసీఆర్ చెప్పినట్టు ఇదొక పథకం కాదు, మహోద్యమం. ఏ మహత్తర కార్యాన్ని తలపెట్టినా యథాతథ శక్తులు అడ్డుచెప్పడం సాధారణమే. డబ్భు ఏండ్ల పాలనలో ఏ రాష్ట్రంలోనూ దళితులను పట్టించుకోని రాజకీయ పక్షాలు కేసీఆర్ చేపట్టిన దళితోద్యమంపై బురద జల్లడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అనేక వ్యతిరేక పరిస్థితుల మధ్య వ్యాపారవేత్తలుగా ఎదిగిన దళితులు మనకండ్ల ముందే ఉన్నారు. బాలికా వధువుగా అనేక కష్టాలు అనుభవించిన కల్పనా సరోజ్ నేడు కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్య సారథి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లులేని పేద కుటుంబంలో పుట్టిన అశోక్ ఖడే ఇవాళ 4,500 మంది ఉద్యోగులున్న దాస్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ (ముంబయి) కంపెనీకి అధిపతి. పొట్ట చేత పట్టుకొని బతకడానికి ఇంటి నుంచి వెళ్ళిన రాజా నాయక్ ఇవాళ కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. మొండి పట్టుదలతో పోరాడాలే గానీ మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటా డు దక్షిణాఫ్రికాలో చక్కెర, సిమెంట్ కర్మాగారాలు నడుపుతున్న దళిత కోటీశ్వరుడు రతీభాయి మక్వానా. రాష్ట్రంలోని దళితులు కూడా ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన చేయూతతో కోటీశ్వరులుగా ఎదగాలి.