‘సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా/ సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం’- అనేది రామాయణంలోని సూక్తి. సత్యమే దేవుడు, సత్యంలోనే లక్ష్మీ ఆశ్రితమవుతుంది. అన్నింటికీ మూలం సత్యమే. సత్యమే పరమోన్నతమైనది. దానిని మించి మరేమీ లేదు- ఇదీ సారాంశం. సత్యానికి ఉన్న గొప్పతనమిది. మునుగోడు సభలో ముఖ్యమంత్రి ఎంత క్లుప్తంగా మాట్లాడారు! అయినా ఆ మితభాషణమే ప్రజలను ఎందుకు ఆకట్టుకున్నది? ఎందుకంటే, ఆ స్వల్ప ప్రసంగంలోనే సత్యాన్ని నుడివారు. వాస్తవాలను ముక్కుసూటిగా చెప్పడం, తాను నమ్మింది ఆచరించి చూపడం కేసీఆర్ శైలి! ఇది ఒక్క రోజు కథ కాదు. గత ఎనిమిదేండ్లలో జరుగుతున్న తంతు ఇది. బీజేపీ నాయకులు కేంద్రంలో సత్పరిపాలన అందించి చూపరు. బీజేపీ పాలిత రాష్ర్టాలను ఆదర్శంగా చూపరు. కానీ డబ్బాలో రాళ్ళు వేసి ఊపినట్టు- అడ్డమైన ఆరోపణలు కుమ్మరిస్తూ లొల్లి చేస్తుంటారు. కానీ ఇదే గత ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేసేదేమిటో చేసి చూపించారు. సత్పరిపాలన అందిస్తున్నారు, సత్యాన్ని మాట్లాడుతున్నారు.
బీజేపీ వారు బొంకడం కోసం యాత్రలు చేపడతారు.. అబద్ధాలను వండి వార్చడానికి బహిరంగ సభలు పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదనేది బీజేపీ ఆరోపణ! ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత బురదజల్లుడు రాజకీయం పెట్టుకోలేదు. మౌనంగా తన పనేదో తాను చేసుకుపోతున్నారు. రైతుకు భరోసా ఇవ్వడానికి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశ పెట్టారు. నిరంతరం నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. కాళేశ్వరం వంటి బృహత్ ప్రాజెక్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసినట్టు ఒక తొండి నాయకుడు అన్నాడు. కానీ కులవృత్తుల నైపుణ్యాన్ని గుర్తించి గొర్రెలు, చేపలు అందించింది రాష్ట్ర ప్రభుత్వమే కాదా? స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్లాస్టిక్ జండాలకు అనుమతిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల దగ్గర కొనుగోలు చేయడం వాస్తవం కాదా?
ప్రధాని మోదీ పాలనలో దేశం నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి. కానీ తెలంగాణలోకి పెట్టుబడులు ప్రవాహంలా వస్తున్నాయి. మేకిన్ ఇండియా నినాదాన్ని ఎలుగెత్తి అరుస్తున్నది బీజేపీ అయితే, మౌనంగా ఆచరించి చూపుతున్నది తెలంగాణ. దేశభక్తి గురించి గొంతెత్తి అరిచే కేంద్ర పాలకులు దేశభద్రతను విస్మరిస్తారు. దేశ ప్రజల సంక్షేమాన్ని అపహాస్యం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దేశభక్తిపై గొడవలకు దిగడం లేదు. మౌనంగా స్వాతంత్య్ర ఫలాలను పేదలకు అందిస్తున్నారు. మౌనం సర్వార్థ సాధనం.. మౌనం ప్రజ్ఞస్య భూషణం అన్నట్టు – మౌనంగానే కేసీఆర్ అన్నీ సాధిస్తున్నారు. ఆ మౌనమే భూషణమై ప్రజలలో విశ్వసనీయతను పెంచుతున్నది.