తెలంగాణ కోసం తెగించి పోరాడుతున్నప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు అనే మూడు అంశాలు ప్రముఖంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి స్థూల అంశాలు. వీటితోపాటుగా తెలంగాణ నినాదానికి బలాన్ని, బలగాన్ని తెచ్చిపెట్టిన అంశం మరొకటి ఉంది. కులవృత్తులు కూలిపోతున్న దృశ్యాన్ని పల్లె కన్నీటి పాటలో ఎతకతగా చెప్పుకున్నం. మహాకవి శ్రీశ్రీ పాటకు సమస్త జాతుల సహస్ర చిహ్నలు ప్రాణం, ప్రణవం అయినయ్. కానీ తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఆ చిహ్నలకు మూలమైన కులవృత్తులు కృశించి నశిస్తున్న సంగతిని కండ్లకు కట్టిన తీరు తెలంగాణవాదుల్లో ఆవేశాన్ని నింపింది. ఉద్యమనేత కేసీఆర్ స్వరాష్ట్ర సారథ్యం చేపట్టిన తర్వాత సమాజంలోని వివిధ నిస్సహాయ వర్గాలకు వరుసగా ఉపశమన చర్యలు చేపట్టారు. వృద్ధులు, మహిళలు, ఇతర అవసరార్థులకు ఉపశమనం కలిగించడం తక్షణావశ్యకతగా గుర్తించి ఆసరా పింఛను గణనీయంగా పెంచి ఆర్తిని తీర్చారు. అదే సమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థలో కీలకమైన కులవృత్తులు కునారిల్లిపోవటం చూసి వాటి పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఆధునికత అనే తుఫానులో దీపకళికలా వణికిపోతున్న కులవృత్తిని రెండు చేతులూ అడ్డుపెట్టి కాపాడేందుకు నడుం బిగించారు.
అన్నం పెట్టేది, అత్యధిక జనాలకు ఉపాధినిచ్చేదీ అయిన వ్యవసాయాన్ని అట్టడుగు స్థాయి నుంచి సర్వోచ్ఛ స్థితికి తొలుత చేర్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసాధ్యమనుకున్న ప్రాజెక్టులు కట్టి పొడిబారిన పొలాలకు నీళ్లు అందించడం, విద్యుత్తు ఉత్పత్తిని అనూహ్యమైన రీతిలో పరుగులు పెట్టించి ఉచిత కరెంటు ఇవ్వటం, రైతుబంధు, రైతుబీమాలతో అండదండలు అందించడం.. ఇవన్నీ సాగు బాగుకు బాటలు వేశాయి. రైతులో ధైర్యం నింపాయి. నేడు పచ్చని పంటలతో తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. వీటన్నిటిపై ఇవాళ దేశమంతటా చర్చ జరుగుతున్నది. అలాగే గత పాలకుల నిరంతర నిర్లక్ష్యానికి గురై నెత్తురు, కన్నీళ్ల కలనేతగా మారిన చేనేతకు మనస్ఫూర్తిగా చేయూతనందించారు కేసీఆర్. మగ్గాలకు, మరమగ్గాలకు పని కల్పించి నేతన్నల గుండెలకు భరోసా ఇచ్చారు. గొర్రెలు, చేపల పంపిణీతో గొల్లకురుమలకు, బెస్తలకు బతుకుబాట చూపించారు.
కులవృత్తుల పునరుద్ధరణ అనే ఈ మహాయజ్ఞంలో భాగంగా, కులవృత్తులు చేసుకునే కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించే వినూత్న పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సహాయానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సొమ్ముతో కులవృత్తులవారు తమకు అవసరమైన పనిముట్లు, ముడిసరుకు సమకూర్చుకోవచ్చు. కంసాలి, మేదరి, కమ్మరి, కుమ్మరి, వడ్ల, రజక, నాయీబ్రాహ్మణ మొదలైన వృత్తికులాలకు ఈ పథకం వరప్రదాయిని లాంటిది. కులవృత్తినే నమ్ముకున్న వారి జీవితాల్లో ఇది గణనీయమైన మార్పు తెస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. దొంగలకు సద్దులు కట్టే కపట రాజకీయులు ఇలాంటి పథకాలను రేవడీలని, తాయిలాలని విమర్శించవచ్చు. దోస్తులకు దేశాన్ని దోచిపెట్టేవారికి పేదల సంగతి ఎందుకు పడుతుంది? ఎవరు ఎన్ని చెప్పినా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన వారికి తక్షణసాయం అవసరం. ఎండలో నడిచొచ్చిన వ్యక్తికి దాహార్తి తీర్చడం లాంటిది. ఓవైపు అభివృద్ధిని అదిలిస్తూనే మరోవైపు సంక్షేమంతో అవసరార్థులకు తక్షణ ఆర్థిక సంరక్షణ కల్పించడం తెలంగాణ మాడల్ గొప్పదనం.