ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎనిమిదేండ్లయినా విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం మీనమేషాలు లెక్కించటం చూస్తుంటే.. కావాలనే జాప్యం చేస్తున్నదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకూ 26 సార్లు కేంద్రం అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఇటీవలి భేటీతో కలిపి ఈ ఏడాదిలోనే నాలుగుసార్లు సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇన్నిసార్లు చర్చలు జరిగినందుకు ఏ సమస్యయినా పరిష్కారం అయ్యిందా అంటే ఏదీ లేదు. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నది. అంతేకాదు, పలుమార్లు కేంద్రం వైఖరి ఏపీకి అనుకూలంగా ఉంటున్నది. తెలంగాణ డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతున్న దృష్టాంతాలు అనేకం.
విభజన చట్టంలో ప్రస్తావించిన వివిధ సంస్థలపై స్పష్టత, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, లేబర్కోర్టు విభజన ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. వీటిపై టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పలుమార్లు కేంద్రానికి దరఖాస్తులు సమర్పించారు. అయినా కేంద్రంలో చలనం లేదు. పైగా ఏపీ చేసే వింత డిమాండ్లకు వంతపాడటం మరీ విచిత్రం. హైదరాబాద్లో వసూలయ్యే పన్నుల్లో వాటా కావాలని, ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలన్న ఏపీ ప్రభుత్వ వాదన పూర్తిగా తెలంగాణ వ్యతిరేకమైనది. మధ్యవర్తి పాత్రను నిర్వహించి, ఏపీని అదుపు చేయాల్సిన కేంద్రం మిన్నకుండటం తెలంగాణపై ఎనిమిదేండ్లుగా చూపుతున్న వివక్షలో భాగంగానే పరిగణించాలి. విభజన అనంతరం రెండు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, దీనిని కూడా కేంద్రం పక్కనపెట్టింది. అదే జమ్ముకశ్మీర్లో మాత్రం ఆగమేఘాల మీద నియోజకవర్గాల పునర్విభజన జరిపింది. బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగానే కేంద్రం వ్యవహరిస్తున్నదని దీనిద్వారా స్పష్టమవుతున్నది.
తెలంగాణ అభ్యంతరాలను లెక్కజేయకుండా రాష్ట్రంలోని ఆరు మండలాలను ఏపీలో కలుపుతూ మోదీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత అనేకసార్లు తెలంగాణ ఏర్పాటును చిన్నబుచ్చేలా, అవమానించేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ వంటి సంస్థలు సిఫారసు చేసినా కూడా తెలంగాణకు ఆర్థికసాయం చేయలేదు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా వంటి చట్టబద్ధమైన హామీలను కూడా తొక్కిపెట్టింది. కృష్ణా జలాల్లో వాటానూ తేల్చకుండా నీటి ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఈ విధంగా మోదీ సర్కారు వైఖరి తొలి నుంచీ తెలంగాణ వ్యతిరేకంగానే కొనసాగుతున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు ఏనాడూ దీనిని ప్రశ్నించకపోవటం వారి నైతికతను, తెలంగాణ పట్ల వారి నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నది. యావత్ తెలంగాణ సమాజం దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.