‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అని నినాదం ఇచ్చినప్పటికీ, ‘సబ్ కో హాత్.. సబ్ కా వినాశ్’ (అందరికీ హ్యాండివ్వటం.. నాశనం చేయటం) అనే విధానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నట్టున్నది! ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, వైద్యం, ఉద్యోగాలు, హక్కులు – ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రజా వ్యతిరేక విధానాలు కోకొల్లలు. దేశంలో కోట్లాదిమంది గ్రామీణ పేదలకు కాస్తంతయినా ఆర్థిక భద్రత కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసురు తీయాలనుకోవడం తాజా ఉదాహరణ. మోదీ హయాం మొదలైనప్పటి నుంచే ఈ పథకాన్ని నిర్వర్యీర్యం చేస్తూ ఉన్నది. కరోనా కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే వాళ్లు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక శారీరక శ్రమనే నమ్ముకున్న శ్రామికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? కానీ, వారిని ఆదుకోవాలనే మానవీయతను కూడా కేంద్రప్రభుత్వం ప్రదర్శించడం లేదు.
ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇప్పటికే నిధులను తగ్గించింది, నిబంధనలను మార్చింది. క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులు చేసుకునేలా రాష్ట్రప్రభుత్వాలకు అధికారం లేకుండా చేసింది. కూలీల ఉపాధి కల్పనకు బదులు సామగ్రికి ప్రాధాన్యం ఇచ్చేలా మార్పులు చేసింది. ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పని కల్పించకపోతే, నిర్ణీత మొత్తంలో భృతి ఇవ్వాలన్న నిబంధననూ తొలగించింది. ఇప్పుడు కూలీలు రోజుకు రెండుసార్లు ఫొటోలు అప్లోడ్ చేయాలని, కొన్ని రకాల పనులు మాత్రమే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో ఓడిన అభ్యర్థులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలని అంటూ కేంద్రం అడ్డగోలు నిబంధనలను జారీ చేసింది. కూలీలకు చేసిన పనులకే వేతనాలు బకాయీలు ఉన్నాయంటే, కొత్తగా బ్యాంకు ఖాతాలు తీసుకోవాలంటూ మెలిక పెట్టింది. పారదర్శకత పేరుతో వంటగ్యాస్ సబ్సిడీలను బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి, చివరికి ఆ సబ్సిడీలకే మంగళం పాడిన సర్కారు వారి చరిత్ర తెలిసినదే. ఇప్పుడు ఉపాధి హామీకీ అదే గతి పట్టించటానికి ఇన్ని ఇబ్బందులను సృష్టిస్తున్నదా మరి?
గ్రామీణ ప్రాంతాల్లో పంట సీజన్ లేనప్పుడు కూలీలకు అంతోఇంతో కడుపు నిండేది ఉపాధి హామీతోనే. అటువంటి పథకాన్ని మరింత పరిపుష్ఠం చేయకపోగా, ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.25 వేల కోట్లు తగ్గించింది కేంద్రం. ఓవైపు లక్షల కోట్ల రూపాయలను మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో ఆశిత్ర పెట్టుబడిదారులకు, బ్యాంకు దోపిడీగాళ్లకు పంచిపెట్టే కేంద్రం.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించటం ఎంత దారుణం? ఈ పథకాన్ని వ్యవసాయపనులతో అనుసంధానించాలని, తద్వారా అటు కూలీలకు ఇటు రైతులకు మేలు జరుగుతుందని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కేంద్రం విజ్ఞతతో తెలంగాణ చేసిన సూచనలను అనుసరించాలి. కూలీల కడుపు కొడితే సామాజిక అశాంతి ఏర్పడుతుందని గ్రహించాలి.