నిజమైన పాలకుడు అందరి గురించీ ఆలోచిస్తాడు.. సమాజంలో పై వరుసలో ఉన్న వారి కంటే కింది వరుసలో ఉన్న నిరుపేదలు, చిరుపేదల గురించే ఎక్కువ శ్రద్ధతో చర్యలు తీసుకుంటాడు. దీనికి నిలువెత్తు ఉదాహరణ ముఖ్యమంత్రి కేసీఆర్. క్షేత్రస్థాయిలో పని చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే శ్రామిక సహోదరులను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. కార్మిక దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.వెయ్యి చొప్పున పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం దీంట్లో భాగమే. తెలంగాణ వచ్చే నాటికి పారిశుద్ధ్య కార్మికుల వేతనం రాష్ట్ర రాజధాని జీహెచ్ఎంసీ పరిధిలో రూ.8,500 కాగా ఇప్పుడది రూ.18,000కు చేరింది. గ్రామ పంచాయతీ పరిధిలోనైతే రూ.2-3 వేలు ఉన్న వేతనం రూ.9,500కు పెరిగింది. తొమ్మిదేండ్ల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్ల పెరుగుదల. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్రను గుర్తు చేస్తూ ‘సఫాయన్నా! నీకు సలాం అన్నా!’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పేర్కొనటం ఆయనలోని సౌహార్దతకు నిదర్శనం.
ప్రజారోగ్యాన్ని పదిలంగా కాపాడటంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం. 2017లో వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. తమకిస్తున్న రూ.1500 పారితోషికాన్ని నాలుగు వేలకు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. అది సరిపోదని, రూ.6 వేలు చేస్తున్నానని సీఎం చెప్పటంతో వారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. అనంతరం 2018, 2021లలో మరో రెండు దఫాలుగా పెరిగి, వారి ప్రస్తుత పారితోషికం రూ.9,750కి చేరుకుంది. దీంతోపాటు పనితీరు ఆధారంగా ఇచ్చే ఇన్సెంటివ్లు అదనం. శిశు సంక్షేమంలో కీలకపాత్ర పోషించే అంగన్వాడీలకు తెలంగాణలో గొప్ప ఆదరణ లభిస్తున్నది. 2014లో రూ.4,200 ఉన్న అంగన్వాడీ టీచర్ వేతనం ఆ తర్వాత 2015లో రూ.7 వేలకు, 2017లో రూ.10,500కు, 2021లో రూ.13,650కు చేరుకుంది. నాటి నుంచీ నేటి వరకూ కేంద్రం వాటా రూ.2,700 మాత్రమే. అదేమీ పెరగలేదు. వాస్తవానికి, మోదీ ప్రధాని కాకముందు అంగన్వాడీల వేతనంలో కేంద్రం వాటా 90 శాతం కాగా రాష్ర్టాల వాటా 10 శాతమే ఉండేది. ఆయన హయాంలో కేంద్రం వాటా 60 శాతానికి తగ్గింది. కేంద్రం ఇటువంటి పనులకు పాల్పడుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాదిమంది అంగన్వాడీలను అక్కున చేర్చుకున్నారు. నేడు మన రాష్ట్రంలో అంగన్వాడీలకు ఉన్న వేతనాలు యావత్ దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలైతే దరిదాపుల్లో కూడా లేవు.
సంపద పెంచాలి, సంపద పంచాలి అన్న ప్రజాసంక్షేమ సూత్రం తెలంగాణలో అమలవుతున్నది. ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో సాధిస్తున్న ప్రగతితో రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా పెరుగుతున్నది. దానికి తగినట్లుగానే శ్రామికుల వేతనాలూ పెరుగుతున్నాయి. హైటెక్లోనే కాదు, హ్యూమేన్ (దయాగుణం)లోనూ తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.