మతోన్మాదం వెర్రితలలు వేసి పది లక్షల మంది పైచిలుకు ప్రాణాలను కోల్పోయిన ఉపఖండ విభజన విషాదాన్ని ఎవరైనా మరువగలరా? మరిచిపోతే చేసిన తప్పులే చేస్తూ పోయే దుర్గతి పడుతుందని విజ్ఞులు హెచ్చరించారు. ఇప్పుడు మరోసారి జడలు విచ్చిన, సుడులు రెచ్చిన మతోన్మాదం విజృంభిస్తున్నది. మొన్న కర్ణాటకలో మత భేదాలను అడ్డుపెట్టుకొని సాగించిన డబుల్ ఇంజిన్ పాలన చూశాం. ప్రజలు ఆ పాలనను పాతరేయడమూ చూశాం. నిన్న మణిపూర్ తెగల మధ్య మతోన్మాద పగలు, సెగలు రగిలించిన రాజకీయ విపరిణామాలూ చూస్తున్నాం. తాజాగా ఢిల్లీని మతోన్మాద జ్వాలలు చుట్టుముడుతున్నా యి. హర్యానాలో మొదలైన అల్లర్లు క్రమంగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్కు పాకాయి. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవీ, జరుగుతున్నవే. మతం తప్ప జనహితం తెలియని కేంద్ర పాలకులు తెరవెనుక నుంచి ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ అని పైకి తెలుస్తూనే ఉన్నది. మణిపూర్పై విశ్వగురు మౌనం అంతా చెప్పకనే చెప్తున్నది.
కట్టేవాళ్లు కావాల్నా.. కూలగొట్టేవాళ్లు కావాల్నా అనేది ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద ప్రశ్న. మతోన్మాదం రెచ్చగొట్టి ఓట్లు దండుకొని గద్దెనెక్కడం, కార్పొరేట్ల కొమ్ముకాస్తూ పాలన సాగించడం బీజేపీకి పరిపాటి అయింది. దైవభక్తి వ్యక్తిగతం. కానీ దానిని బజారులోకి లాగి పబ్బం గడుపుకోవాలని అనుకోవడం కుటిలత్వం. మందిర్-మస్జీద్ వాదం నుంచి లబ్ధి పొంది అధికారానికి చేరువైనప్పటి నుంచీ బీజేపీ ఈ తరహా కుటిల పన్నాగాలనే నమ్ముకుంటున్నది. ప్రజలు కోరుకునే ప్రగతి భాష వారికి తెలియదు. అదే సమస్య. అయితే ఇదేం చిన్నాచితకా సమస్య కాదు. దేశాన్ని చిన్నాభిన్నం చేసే సమస్య. మతం, దేవుడు ఎప్పుడూ హింసకు వ్యతిరేకమేనని, బీజేపీని అలా వదిలేస్తే మతగజ్జి దేశమంతటా వ్యాపింపజేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరికను ఇక్కడ గుర్తుచేసుకోవడం అవసరం. దేశ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మతపిచ్చి మంటలా? ప్రగతి జేగంటలా?
రైతులు సాగుబడికి సాయాన్ని ఆశిస్తున్నారు. పారిశ్రామికులు మౌలిక వసతుల కల్పన, రాయితీలు, సత్వర అనుమతులు ఇస్తే చాలంటున్నారు. యువత ఉద్యోగాలు ఇమ్మంటున్నది. వయసుడిగినవారు పింఛన్ భరోసాతో శేషజీవితాన్ని హాయిగా గడిపేస్తామంటున్నారు. దేశానికి కావాల్సింది బుజ్జగింపు రాజకీయాలు కాదు. బుసకొట్టే రాజకీయాలు అసలే కాదు. ప్రజలను బురిడీ కొట్టించడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని నిర్ణయించుకున్న భారత ఓటర్లు తెలంగాణ మాడల్ వైపు ఆశగా చూస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ విపరీత ధోరణులు తదేకంగా గమనిస్తున్న ప్రజలు తెలంగాణలో అంగలు వేస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందడం కూడా చూస్తున్నారు. రైతు కేంద్రంగా విధానాలు రూపొందించుకుని సకల రంగాలకు చేదోడువాదోడుగా నిలవడం, సంపద పెంచడం, నలుగురికీ పంచడం అనే కేసీఆర్ విధానం ఇప్పుడు దేశంలో చర్చాంశమైంది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం జాతిజనుల గుండెల్లో మార్మోగుతున్నది. సీఎం కేసీఆర్ పదేపదే నొక్కిచెప్పే గంగా జమున తెహజీబ్ను కాపాడుకోవాలని భిన్నమతాలు, భిన్న సంస్కృతుల దేశం చూస్తున్నది.