దేశ ఆర్థిక వ్యవస్థకు అదానీ తీసుకొచ్చిన పెను ముప్పు గురించి చర్చించాలని, ఈ వ్యవహారంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, ఆప్ కొన్ని రోజులుగా పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. తనకు అలవాటైన ఏకపక్ష ధోరణిని మార్చుకోలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. తమను ఐక్యపరిచి ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఈడీకి ప్రతిపక్షాలు కృతజ్ఞతలు తెలుపాలనడం ద్వారా విపక్షాలపై దాడులు చేయిస్తున్నట్టు ఆయనే స్వయంగా అంగీకరించినట్లయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ, తన హయాం మొదలైన తర్వాతే భారతదేశం వెలిగిపోతున్నదని ఎప్పటిలాగే స్వోత్కర్ష చేసుకున్నారు. కానీ గణాంకాలు మాత్రం అన్ని రంగాలలో దేశం వెనుకబడిపోయిందనే చెబుతున్నాయి.
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో రెండు వారాల్లోనే అదానీ సంపద అక్షరాలా పది లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇది ఇక్కడితో ఆగబోదని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఈ కుంభకోణం తీవ్రంగా దెబ్బతీస్తుందని, ప్రపంచ పెట్టుబడిదారులు భారత్లోకి రావటానికి పునరాలోచిస్తున్నారని అనేక అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. కరోనాతో నష్టాలను, అప్రతిష్ఠను మూటగట్టుకొన్న చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చైనా బలహీనపడినప్పుడు అనేక అంతర్జాతీయ కంపెనీలు ఆ దేశం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వాటిని ఆకర్షించటానికి భారత్కు అదొక సువర్ణావకాశం. కానీ కేంద్ర పాలకుల అసమర్థత వల్ల అది చేజారిపోయింది. ఇప్పుడు చైనా తిరిగి కోలుకోవటంతోపాటు భారత ఆర్థికరంగంపై అదానీ నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిని జాతీయ ప్రాధాన్య అంశంగా తీసుకొని పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాలతో సమగ్ర చర్చలు జరిపి, యుద్ధప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టటం తక్షణావసరం. కానీ ఇటువంటి సంక్షోభంలోనూ బీజేపీ ప్రభుత్వం తన వ్యాపార మిత్రుల లబ్ధి గురించే ఆలోచించటం అభ్యంతరకరం.
అదానీ సంస్థల ఆస్తులను జాతీయం చేసి వేలం వేయాలని, వచ్చిన మొత్తంతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి తమ సొంత ప్రభుత్వానికి సూచించారు. ఆ స్థాయిలో కాకపోయినా, కనీసం విచారణకు కూడా సర్కారు అంగీకరించటం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? అదానీపై ఈగ వాలనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ కవచంలా మారింది. మరోవైపు సెబీ వంటి ఆర్థిక నియంత్రణ సంస్థల అధిపతులతో అదానీ సమావేశమవుతున్నారు. నిందితుడే న్యాయమూర్తులతో భేటీలు జరిపితే ఇక న్యాయం జరిగినట్టే! ఈ భారీ స్కాంపై యావత్ ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సడలింపు చూపకూడదు. లక్షలాది మంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలు, దేశ స్టాక్మార్కెట్ ప్రతిష్ఠతో ముడిపడిన ఈ అంశంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, అక్రమాలు చేసిన వారికి శిక్ష పడే వరకూ విశ్రమించ కూడదు. ఢిల్లీ వీధుల్లో ఏడాదిపాటు కదం తొక్కి ప్రధాని చేత క్షమాపణలు చెప్పించిన రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.