Covid-19 | మనిషితో దాగుడుమూతలు ఆడుతున్న కరోనా మరోసారి కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తర్వాత మళ్లీ కరోనా బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. దేశంలో ఈసరికే ఐదుగురు కరోనా సోకి మరణించినట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సహజంగానే ఇది ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం జేఎన్-1 అనే కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తున్నట్టు తెలుస్తున్నది. అమెరికా, చైనాలో దీనివల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు భారత్లో జేఎన్-1 కేసులు నమోదు కావడం కలవరపరిచే చర్యగానే భావించాలి.
డిసెంబర్ 8న ఈ వైరస్ మొదటిసారిగా కేరళలో బయటపడింది. అక్కడ ఈసరికే కేసుల సంఖ్య వేగంగా రెండు వేల వైపు పరుగులు తీస్తున్నది. ముగ్గురు లేదా నలుగురు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. కర్ణాటకలో, యూపీలో ఒక్కొక్కరు మరణించడం రెండు విషయాలను తెలియజేస్తున్నది. ఒకటి వైరస్ వేగంగా దేశంలోని నలుమూలలకు పాకుతుండటం, రెండు వైరస్ వల్ల ప్రాణాలు పోతుండటం. శీతాకాలం కావడం వల్ల శ్వాసకోశ సంబంధ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కరోనాపై కఠినమైన నిఘా అమలుచేయాలని, పరీక్షలను పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. తీవ్రతను అర్థం చేసుకున్న కేంద్రం రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు స్పందించి ప్రజలకు హెచ్చరికలు జారీచేసి దవాఖానల్లో ఐసోలేషన్ బెడ్లు కూడా సిద్ధం చేయించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, చేతుల శుభ్రత వంటివి పాటించాలని, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యపరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలు జారీచేసింది.
గతంలో దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయి ఉంటాయి. అయినా ఇటీవలి కాలంలో ప్రజల్లో కరోనా భయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. కరోనా కల్లోలం నుంచి తేరుకొని ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నది. కరోనా అంటే ఒకరకమైన అలసత్వం, విసుగూ రెండూ వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కొవిడ్ కొత్త అవతారాలు ఎత్తుతూ వ్యాపిస్తుండటం, స్వల్పసంఖ్యలో అయినా మరణాలకు కారణమవుతుండటం తేలికగా తీసుకునే విషయమైతే కాదని ప్రజలు గుర్తించాలి. కరోనా ముందు, కరోనా తర్వాత అనే కాల విభజనను గుర్తుంచుకోవాలని నొక్కిచెప్పాల్సిన అవసరం లేదు. సంపన్న, బీద దేశాలనే తేడా లేకుండా లక్షల సంఖ్యలో ప్రజలు మరణించడం, కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమై కుప్పకూలిపోవడం మనం చూశాం. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 70 లక్షలకు చేరుకున్నదన్న సంగతి మరిచిపోరాదు. ముప్పు చాలావరకు తగ్గినప్పటికీ పూర్తిగా పోలేదని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత కరోనా రకం మహమ్మారి స్థాయికి విస్తరించనప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి. కరోనా చికిత్స శ్రమదమాదులతో కూడుకున్నది కనుక చికిత్స కన్నా నివారణే మేలన్న సూక్తి అందరికీ శిరోధార్యం.