తెలంగాణ స్వపరిపాలన సుపరిపాలన కావాలంటే రైతు కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆ దిశగా ఆయన అడుగులు వేశా రు. అందుకే భూమి తడారిపోయి మొగులు వైపు దిగులుగా చూసే రోజు లు పోయాయి. కరెంటు కష్టాలకు చెక్ పెట్టి, నీటి గోసను తరిమికొట్టి, రైతుబంధుతో పెట్టుబడి బాధ లేకుండా చేశారు. బీమాతో రైతులకు ధీమా కల్పించారు. మిషన్ కాకతీయ, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు, గోదాముల నిర్మాణాలు, రైతు వేదికలు, మార్కెట్ సౌక ర్యాలు.. ఇలా రైతన్నకు అన్నివిధాలుగా అండగా నిలిచారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న సందర్భంలో నిండిన చెరువు, పండిన పైరు పచ్చపచ్చని పండుగ చేసుకుంటున్నాయి. రైతురాజ్యం అంటే ఇది కదా అని దేశం నివ్వెరపోయేలా చేశారు.
అయితే ఇవన్నీ ఒక్కరోజులో జరిగినవి కావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనతో ప్రణాళికలు వేసుకొని సాధించిన విజయాలు. ముందుగా సాగు మెరుగుదలకు సౌకర్యాలు సమకూర్చారు. తర్వాత మార్కెటింగ్ సదుపాయం కల్పించారు. ఇప్పుడు దిగుబడి పెరిగింది. వరిలో పంజాబ్ను దాటిపోయాం. తెలంగాణలో నేడు 3 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అవుతున్నది. పాలమూరు, డిండి తదితర నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే దిగుబడి ఇంకా పెరుగుతుంది. అందుకే పెరిగిన దిగుబడి విషయంలో మరో వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచన ముందుకుతెచ్చారు. సోమవారం ధాన్యశుద్ధి దిగ్గజ సంస్థ అయిన జపాన్కు చెందిన సటేక్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ధాన్యశుద్ధి విషయమై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పౌరసరఫరాలపై సమగ్ర సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రకటించారు. కల్లాల్లో పంట నిల్వచేస్తే వాన భయం. మార్కెట్కు పోవాలంటే రవాణా తలనొప్పి. సరైన ధర లభిస్తుందో లేదోననే భయాలు ఎటూ ఉంటాయి. పైగా పెరిగిన దిగుబడికి తగిన రైసు మిల్లుల్లేవు. ఈ అన్నిరకాల తిప్పలు తప్పించేందుకు రాష్ట్రమంతటా రైసుమిల్లులను పెద్దఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక రైతు తన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులో ఆడించి దర్జాగా లెక్క చూసుకోవచ్చు.
రైతు పంటకు ఓపెన్ మార్కెట్ ధర లభించేలా చేసేందుకు వరిధాన్యాన్ని పలురకాల ఉత్పత్తులుగా మార్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకు జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తామన్నారు. ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నుల బియ్యాన్ని ఆడించే అత్యాధునిక రైసు మిల్లులను ప్రారంభిస్తామన్నారు. వీటికి అనుసంధానంగా గోదాములను, అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ యూనిట్లు నెలకొల్పుతారు. వీటన్నింటి నిర్వహణ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు రూ.2 వేల కోట్లు కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దేశానికి రైతు వెన్నెముక అని అందరూ అంటారు. కానీ ఆ రైతు సగర్వంగా తలెత్తుకుని నిటారుగా నిలబడేలా చేసింది ఎవరంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అనే సమాధానం కచ్చితంగా వచ్చితీరుతుంది. తాజా ప్రకటనలతో వ్యవసాయం మరింత లాభసాటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ వ్యవసాయంలో ఇది మూడో అతిపెద్ద అడుగు అవుతుందని చెప్పవచ్చు.