ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్తున్నది. ఏయే బ్యాంకులకు ఉరి బిగించాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నది. త్వరలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయవచ్చని తాజాగా వెల్లడైంది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా చర్యలను వేగవంతం చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నీతిఆయోగ్ 2021లో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఆ రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు, ఐడీబీఐని కూడా ప్రైవేటీకరిస్తామని తెలిపారు. దారి సుగమం చేసేందుకు వీలుగా, సంబంధిత చట్టాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ‘బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు-2021’ను రూపొందించింది. కానీ, పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు.
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ‘బ్యాంక్ బచావో.. దేశ్ బాచావో’ అంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రారంభించాయి. మరోవైపు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నది. దీంతో మోదీ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి బ్యాంకులకు గండం గడిచినట్లేనని అందరూ భావించారు. కానీ, తాజాగా మళ్లీ కదలికలు మొదలయ్యాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు కాకుండా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంకు వంటి 12 ప్రభుత్వరంగ చిన్న బ్యాంకులపై ఈసారి మోదీ సర్కారు గురి పెట్టింది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని తెలుస్తున్నది. బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని మోదీ సర్కారు ఉపసంహరించుకోలేదని, ఏదోరకంగా ముందుకు వెళ్లటానికే సిద్ధపడిందని స్పష్టమవుతున్నది.
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అన్నది ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు సంబంధించిన సమస్యనే కాదు, అది కోట్లాదిమంది ఖాతాదారుల, ప్రజల సమస్య కూడా. 1969లో దేశంలో బ్యాంకుల జాతీయీకరణ జరుగకముందు, ప్రైవేటు బ్యాంకులు నగరాల్లో ఉండేవి. అవి సంపన్నులకు, భూస్వాములకు మాత్రమే సేవలందించేవి. జాతీయీకరణతో బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా ప్రభుత్వ బ్యాంకులు విస్తరించాయి. అప్పటి వరకూ బ్యాంకులంటే తెలియని సాధారణ ప్రజలకు అవి కొండంత అండగా నిలిచాయి. అవసరమైనప్పుడు రుణాలిచ్చాయి. కష్టార్జితాన్ని భద్రపర్చుకోవటానికి అవకాశాన్నిచ్చాయి. ఎఫ్డీల రూపంలో నికర ఆదాయానికి ఒక మార్గం చూపాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలను సాకారం చేశాయి. భారతదేశ ఆర్థికవ్యవస్థ కుదురుకోవటంలో ప్రభుత్వ బ్యాంకులు పోషించిన పాత్ర అనిర్వచనీయం. వాటిని మరింత బలోపేతం చేయాలేగానీ, వాటి గొంతు పిసకటం వల్ల అనూహ్యమైన విపరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. ప్రభుత్వ బ్యాంకులను పరిరక్షించుకోవటం అందరి కర్తవ్యం.