తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవటం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. అదానీ కుంభకోణం. దేశం పరువు ప్రతిష్ఠలే కాకుండా, లక్షలాది మంది చిన్న, మధ్యతరగతి ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో కూడిన ఈ అంశంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలని పార్లమెంటులో గత 22 రోజులుగా దాదాపు 300 మంది విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా పార్లమెంట్ భవనంపైనే భారీ బ్యానర్ను ప్రదర్శించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటిది ఎన్నడూ జరగలేదు. అయినప్పటికీ మోదీ గానీ, బీజేపీ గానీ పెదవి విప్పకపోవటం పూర్తి బాధ్యతారాహిత్యం. ఈ ఒక్క అంశమే కాదు.. గత తొమ్మిదేండ్లలో అనేక దృష్టాంతాలు కేంద్రం పక్షపాత వైఖరిని వెల్లడిస్తున్నాయి.
కారు ఎక్కించి రైతుల మరణానికి కారణమైన దారుణ ఘటనకు సంబంధించి.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి దింపాలని డిమాండ్ వచ్చినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కర్ణాటకలో బీజేపీ సర్కారు పెద్దలు కమీషన్ల పేరుతో కాల్చుకు తింటున్నారని కాంట్రాక్టర్లు, మఠాధిపతులు మొరపెట్టుకున్నా విచారణ లేదు. అదే రాష్ట్రంలో లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన పార్టీ నేతలపైనగానీ, వారి వారసులపైనగానీ చర్యలుండవు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవు. తానొక హత్య చేశానని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బహిరంగంగా మీడియా ముందు ప్రకటించినా అతడి మీద ఎటువంటి దర్యాప్తులు ఉండవు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి వచ్చి చిక్కిన నిందితులు పలుమార్లు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కుమార్తో తమకు ఉన్న సంబంధాలను వెల్లడించారు. ఆ కేసులో ఆయన మీద తీవ్ర ఆరోణలున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన ముఖం చాటేశారు. అయినప్పటికీ పార్టీపరంగా అతడిపై చర్యలు ఉండవు. ప్రతిపక్షాలను బలహీనపరచటానికి, విపక్ష ప్రభుత్వాలను కూల్చటానికి మాత్రం ఎడాపెడా కేసులు, కేంద్ర సంస్థలతో దాడులు, సోదాలు, విచారణలు, దర్యాప్తులు.
ప్రస్తుతం మన దేశంలో ఒక సంధి దశ నడుస్తున్నది. 140 కోట్ల మంది భారతీయుల భవితవ్యాన్ని తాము నిర్దేశించగలమని, సర్వ మూ తమ చేతుల్లోనే ఉన్నదన్న భ్రమలో బీజేపీ పాలకులున్నారు. భ్రమలు ఏదో ఒకనాటికి పటాపంచలు కాకతప్పదు. ప్రజలు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగానే ఉండరు. సమయం వచ్చినప్పుడు తీర్పును ప్రకటిస్తారు. కేంద్రం పక్షపాత ధోరణిని, విపక్షాలను వేటాడుతూ ప్రజాస్వామ్యంపై జరుపుతున్న స్వారీని, ఎన్ని ఆరోపణలు వచ్చినా అదానీ వంటివారిపై చర్యలు తీసుకోకపోవటాన్ని.. అంతటినీ గమనిస్తున్నారు. కచ్చితంగా భారతీయులు స్పందిస్తారు. ఇండియా రియాక్ట్స్.