Kachchatheevu Island | బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉన్నది. దక్షిణాదిలో మొన్నటివరకు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక కూడా చేజారడంతో ఈ ముద్ర మరోసారి చర్చనీయాంశమైంది. దీన్ని ఛేదించేందుకు ప్రధాని మోదీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదిలో ప్రతి స్టేటూ, ప్రతి ఓటూ ముఖ్యమే అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల తమిళనాడుపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. తన ఎక్స్ ఖాతాలో తమిళ భాషా హ్యాండిల్ కూడా చేర్చారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రశంసించే కామెంట్లు అందులో కనిపిస్తున్నాయి.
తమిళ సంప్రదాయిక వేష్టి ధరించి ఓ తమిళ చానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇడ్లీ, దోశ లాగే తమిళ భాష కూడా విశ్వవ్యాప్తం కావాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆకాంక్షించారు. ఇదే ఒరవడిలో ప్రధాని మోదీ కచ్చతీవుపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ఎన్నికల వేళ కొంత సంచలనానికి దారితీశాయి. జాతీయ, అంతర్జాతీయ సమస్యలన్నిటికీ కాంగ్రెస్ తప్పిదాలే కారణమని ఆయన విమర్శించడం తెలిసిందే.
అదే క్రమంలో ఇప్పుడు కచ్చతీవును శ్రీలంకకు కాంగ్రెస్ ఇచ్చేసిందని, డీఎంకే దానికి తలూపిందనేది ఆయన మాటల సారాంశం. దీనిపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ‘కండ్లు తెరిపించే అద్భుతం.. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేసినట్టు వెల్లడించే కొత్త సంగతులు’ అంటూ వ్యాఖ్య కూడా చేర్చారు. కచ్చతీవు సమస్యను విస్మరించి కాంగ్రెస్, ఆ పార్టీని సమర్థించే డీఎంకే తమిళ ప్రజలకు ద్రోహం చేశాయనే దిశగా చర్చను తీసుకువెళ్లడం ప్రధాని ఉద్దేశమని తెలుస్తున్నది. అయితే కచ్చతీవు నిజంగానే తమిళనాట ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉన్నదా? అనేది ప్రశ్న.
సముద్ర సరిహద్దు రేఖపై భారత్, శ్రీలంక దేశాలు 1974లో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందంలో రామేశ్వరానికి చేరువలో ఉండే నిర్మానుష్య దీవి అయిన కచ్చతీవు శ్రీలంక వైపు వెళ్లింది. అంటే కచ్చతీవు చుట్టూరా ఉం డే సముద్రజలాలపై హక్కులు శ్రీలంకకే ఉంటాయని అర్థం. అప్పుడప్పుడూ ఈ దీవి అప్పగింతపై రాజకీయ విమర్శలు రావడం గత 50 ఏండ్లలో తరచూగా జరుగుతున్నది. నిర్మానుష్యంగా, ఊసర క్షేత్రంలా ఉండే కచ్చతీవు ఎందుకూ పనికిరాదు.
అయితే సమస్య దీవి కన్నా, అక్కడ చేపలు పట్టే హక్కుకు సంబంధించిందని చెప్పవచ్చు. 1991లో అన్నాడీఎంకే నేత జయలలిత ఆ హక్కులను భారత్ తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పదేండ్లకు 2001లో అప్పటి ప్రధాని వాజపేయిని ఆమె కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేశారు. మరో పదేండ్లకు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. 2013లో డీఎంకే నేత కరుణానిధి భారత-శ్రీలంక ఒప్పందం రద్దును డిమాండ్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు.
ఇలా అడపాదడపా ప్రస్తావనకు వచ్చే ఈ అంశం ఇప్పుడు బీజేపీకి ఎన్నికల అస్త్రంగా ఉపకరిస్తుందా? అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే 1977 నుంచి ఇప్పటివరకు రామేశ్వరం భాగంగా ఉన్న రామనాథపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ లేదా డీఎంకే వరుసగా గెలుస్తూ వస్తుండటమే అందుకు నిదర్శనం. పైగా 2015లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ వివాదానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు స్పష్టం చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏదో బయటకు వచ్చినట్టు చెప్పి ఈ అం శంపై తమిళ ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది సందేహమే. గత పదేండ్లలో మోదీ ఒక్కసారైనా శ్రీలంకతో కచ్చతీవు వివాదాన్ని ప్రస్తావించారా? అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సవాల్ విసిరారు. ఇక ప్రధాని మోదీ అసలు దోషిగా నిలబెట్టాలనుకున్న కాంగ్రెస్ కూడా రెండు దేశాల ఒప్పందం భూభాగాలు ఇచ్చివేయడానికో, పుచ్చుకోవడానికో జరిగింది కాదని, అది కేవలం సముద్ర తీర సరిహద్దుల విభజనకు సంబంధించిందని కేంద్రమే 2015లో ఇచ్చిన ప్రకటనను ప్రస్తావిస్తున్నది. ఇందుకు సంబంధించి సమాచార హక్కు చట్టం లేఖకు విదేశాంగ శాఖ ఇచ్చిన సమాధానాన్ని శివసేన (ఉద్ధవ్) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంకా చతుర్వేదీ సోషల్మీడియాలో ఇతరులతో పంచుకున్నారు.
తమిళనాడులో ఎన్నికల అంశంగా కచ్చతీవు ప్రముఖంగా వచ్చే సూచనలు తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు పొరుగు దేశమైన శ్రీలంకతో తలనొప్పి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంపై శ్రీలంక ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ అక్కడి మీడి యా మాత్రం భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. మరోవైపు మాజీ దౌత్యవేత్తలు ఈ వివాదంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేండ్ల తర్వాత ఒప్పందం రద్దు గురించి మాట్లాడటం శ్రీలంకతో సంబంధాలు, భారత్ విశ్వసనీయతపై ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఈ సరికే చైనా ప్రభావ పరిధిలోకి వెళ్లిపోయిన శ్రీలంకతో ఆచితూచి వ్యవహరించక తప్పదనేది తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అంతర్జాతీయ అంశాలను లాగడం ప్రధాని మోదీకి పరిపాటి అయింది. గతంలో పాక్, చైనా, బర్మా తదితర దేశాలతో ముడివడిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆ కోవలోనే ఇప్పుడు కచ్చతీవు వచ్చిచేరింది. కేవలం ఓటు రాజకీయాల కోసం లేనిపోని అంతర్జాతీయ సమస్యను తెచ్చిపెట్టుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మాత్రం సమర్థనీయం కాదు.