లిక్కర్ స్కాం అనేది ఓ బ్రహ్మపదార్థంలా తయారైంది. రూ.వంద కోట్ల కుంభకోణం అని అంటున్నప్పటికీ డబ్బు చేతులు మారడం గురించి ఇప్పటిదాకా దర్యాప్తు సంస్థలు కోర్టులో రుజువులు చూపలేకపోయాయి. ఈలోగా ‘రాజకీయ అరెస్టులు’ మాత్రం అడ్డూఅదుపూ లేకుండా జరిగిపోతున్నాయి. కేసులోని సెక్షన్ల తీవ్రత కారణంగా బెయిలు అంత సులభంగా దొరకడం లేదు. అప్రూవర్గా మారిన నిందితులు ఇచ్చే వాంగ్మూలాలతో నడుస్తున్న కేసు ఇది. కోర్టులు కూడా ఆధారాల గురించి దర్యాప్తు సంస్థలను నిలదీసిన సందర్భాలు ఈ కేసులో ఉన్నాయి.
అరెస్టయినవారిలో అత్యధికులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వారే. వారిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఇప్పటివరకు బెయిల్ రాలేదు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు కొన్నాళ్ల క్రితమే బెయిల్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ దరఖాస్తులను కోర్టులు పదేపదే తిరస్కరిస్తున్నాయి. ఆమె తర్వాత అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ‘నిందితుడు పాత నేరస్థుడు ఏమీ కాడని’ సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెప్పడం కేంద్రానికి ఓ చెంపపెట్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు విస్పష్టంగా అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆ మేరకు ఆయన కూడా తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రచార రంగంలోకి దూకి ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తూ వేడిని పుట్టిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ కేసులో, అదేవిధంగా ఇలాంటి కేసుల్లో అరెస్టయిన ఇతరులకు ఈ బెయిల్ తీర్పు ఓ మార్గదర్శకం అవుతుందా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అరెస్టు చేయబోయే ముందు లేదా చేసిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా ఇచ్చేందుకు నిరాకరించారు. సీఎంగా జైలుకు వెళ్లడమే కాకుండా జైలు నుంచి సర్కారును నడిపిన నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే, కేంద్రంలోని బీజేపీ సర్కారు తనను జైలులో పెట్టిందని, వారికి ఆ అవకాశం ఇవ్వకూడదనే తాను రాజీనామా చేయకుండా మొండిగా నిల్చున్నానని కేజ్రీవాల్ చెప్తున్నారు. కేజ్రీవాల్ తరహాలోనే కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అరెస్టుకు ముందురోజే రాజీనామా చేశారు.
ఇప్పుడాయన రాజీనామా చేసినందుకు చింతిస్తున్నారో లేదో తెలియదు కానీ, కేజ్రీవాల్ విషయంలో ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు తనకూ వర్తిస్తాయని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. దీనిపై ఈడీ, సీబీఐ సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రెండూ తర్జనభర్జనలో పడ్డాయని వినికిడి. కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను విపక్షాలను లొంగదీసుకునేందుకు ఉపయోగించుకోవడం అనేది ఇప్పుడు బహిరంగ రహస్యమే. ఎన్నికలు సమీపించిన తర్వాత విపక్ష నేతలను అరెస్టు చేయడం అనుమానాలకు దారితీయడం తెలిసిందే. ప్రచారం చేయకుండా గొంతు నొక్కేందుకే విపక్ష నేతలను జైళ్లల్లో పెడుతున్నారనే ఆరోపణలు బలంగానే వినవస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగానే భావించాలి. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచడంలో ఎంతగానో తోడ్పడతాయని చెప్పక తప్పదు.