ఎన్నికల ఉపన్యాసాల్లో ఎంతోకొంత ‘అతి’ ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ, అవి శృతిమించి పాకాన పడితే ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతింటుంది. ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలను అనుసరిస్తాయి. అయితే ఆ ఎత్తుగడలు కులపరంగా, మతపరంగా ప్రజలను చీల్చడం, ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలకు పాల్పడటం వంటి అనామోదయోగ్య చర్యలుగా దిగజారితే ప్రమాదం. అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల సీజన్లో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల ఓట్ల వ్యూహం శ్రుతిమించి పాకాన పడుతుండటం మనం చూస్తున్నాం. ప్రస్తుత ఎన్నికల సంవాదంలో అభివృద్ధి ఎజెండా మృగ్యమైపోవడం ఓ విషాదం. ప్రజాసమస్యల ప్రస్తావన లేకుండా కేవలం భావావేశాలు రెచ్చగొట్టడం మీదనే జాతీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ మతపరమైన సెంటిమెంట్ను వాడుకుంటున్నదని, పోటీగా కాంగ్రెస్ కులపరమైన ఆవేశాలు రెచ్చగొడుతున్నదనే ఆరోపణలు వస్తుండటం తెలిసిందే.
ఈ పరిస్థితి ఇలా ఉంటే నిష్పాక్షిక మధ్యవర్తిత్వంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం పారదర్శకత, విశ్వసనీయత అనేక వివిధానేక కారణాల వల్ల సందేహాస్పదం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలపై సత్వరం స్పందించకపోవడం, బీజేపీ విషయంలో చూసీచూడనట్టు పోవడం, బీజేపీయేతర పార్టీలపై చిన్నాచితకా విషయాలకు ప్రచార నిషేధాలు విధించడం విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల ప్రసంగాల స్థాయి దిగజారడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాతీయ ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఎన్నికల సంఘం తాజాగా పది సూత్రాలతో కూడిన కఠినమైన ఆదేశాలు జారీచేసింది. భారతీయ సామాజిక-సాంస్కృతిక వైవిధ్యం కాలపరీక్షకు తట్టుకొని నిలిచిందని, దానిని ఎన్నికల కోసం బలిపశువును చేయవద్దని హితవు పలకడం విశేషం. భారతీయ ఎన్నికల సాంప్రదాయాలపై రెండు పార్టీలు రాజీపడొద్దని తేల్చిచెప్పింది. బహిరంగ ఉపన్యాసాల్లో మర్యాదలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని తమతమ ప్రచారకర్తలకు అధికారికంగా ఆదేశాలు జారీచేయాలని కూడా సూచించింది. ఇలాంటివే మొత్తం పది అంశాలను ఈసీ తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.
ప్రధాన పక్షాలకు ఈ తరహా హెచ్చరికలు జారీచేయడం భారతీయ ఎన్నికల చరిత్రలో అసాధారణమే. ఆ సంగతి ఈసీ తన ఆదేశాల్లో కూడా ప్రస్తావించింది. కాకపోతే ప్రచారాల తీరు పతనావస్థకు చేరుకున్న తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఈసీ చాలా ఆలస్యంగా మేలుకోవడమే అసలు సమస్య. ఏడు విడతల ఎన్నికల సీజన్లో ఐదు విడతలు పూర్తయిన తర్వాత ఈసీ ఈ ఆదేశాలు జారీ చేయడం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తున్నది. బీజేపీ తన ప్రచారంలో మతపరమైన అంశాల జోలికి వెళ్లకూడదని, రాజ్యాంగం రద్దయిపోతుందనే ప్రచారం కాంగ్రెస్ మానుకోవాలని ఈసీ తన ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ఎన్నికల్లో సరైన పద్ధతులు పాటించడం విషయంలో పాలక పక్షానికి అదనపు బాధ్యతలు ఉంటాయని గుర్తుచేసింది. కానీ, ఇప్పటిదాకా జరిగిన ఘోరమైన ఉల్లంఘనల మాటేమిటి? వాటిపై స్పందనలు, చర్యలు పెద్దగా ఉంటాయని భావించే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ తరహా అపనమ్మకాన్ని తొలగించేందుకు ఈసీ నిర్మొహమాటంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కావాల్సింది కఠినమైన హెచ్చరికలు కాదు, కఠినమైన చర్యలు. లేకపోతే బాహాటంగా ఉల్లంఘనలు జరుగుతుంటే ఈసీ చూస్తూ కూర్చున్నదనే విమర్శలను తప్పించుకునేందుకు జరిపిన మొక్కుబడి ప్రయత్నంగానే ప్రస్తుత ఉత్తర్వులను చూడాల్సి వస్తుంది.