కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోట నగరంలో గత నాలుగేండ్లలో 52 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. గత ఏడాదిలోనే కోచింగ్ సెంటర్లలో 15 మంది మరణించారని ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. 2014-21 మధ్యకాలంలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విద్యాసంస్థలలో 122 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్సభకు తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ విద్యార్థులలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ప్రవేశించాలని, ఆ తరువాత భారీ ప్యాకేజీల ఉద్యోగంలో చేరాలనే సామాజిక, కుటుంబ ఒత్తిడి విద్యార్థులపై ఎంతగా ఉంటున్నదో దీనిని బట్టి తెలుస్తున్నది. ఈ రెండు రాష్ర్టాలలో కోచింగ్ సెంటర్లకు వెళ్లే సంస్కృతి ఏ స్థాయికి వెళ్లిందనేది కూడా అర్థం చేసుకోవచ్చు.
‘బడికి నడువలేడు, పాఠాలు వినలేడు/ చిన్న పద్యమప్ప జెప్పలేడు/ రాజరాజ బిడ్డరా నేటి విద్యార్థి/ లలిత సుగుణజాల! తెలుగుబాల!’ అంటూ తాను చూసిన పాత కొత్త కాలాల మధ్య వచ్చిన మార్పును చూపించారు కరుణశ్రీ. నిజమే, పాత కాలంతో పోలిస్తే విద్యావ్యవస్థలో నాటి కాఠిన్యం లేదు. పదవ తరగతి వరకు పరీక్షలలో ఉత్తీర్ణత తప్పనిసరి కూడా ఉండేది కాదు. చదువు పరీక్షల చుట్టూ తిరగకుండా విద్యార్థి కేంద్రంగా ఉండాలనే భావన బలపడింది. అటువంటి విధానంలోనూ, ఆంగ్ల మాధ్యమం లేకున్నా, అనేకమంది భిన్నరంగాల ప్రముఖులు పుట్టుకొచ్చారు. కానీ ఆ కాలం మళ్లీ మారిపోయింది! ఇప్పుడంతా కోచింగ్ సెంటర్ల పటాటోపం నడుస్తున్నది. శరీరానికి సర్కస్ ఫీట్లు అలవాటు చేసినట్టు ఒక నిర్ణీత పద్ధతిలో శిక్షణను పోటాపోటీగా ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల మానసిక స్థితి, మేధో వికాసం, సామాజికీకరణ వంటి ఇతర అంశాలను గాలికి వదిలేస్తున్నారు.
ఐఐటీలలో స్వీయ అధ్యయనంలో విఫలమైనప్పుడు, మీరు కోచింగ్ సెంటర్ల బాపతు కదా అంటూ తోటి విద్యార్థులు, కొందరు అధ్యాపకులు అవహేళన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆంగ్ల మాధ్యమానికి అలవాటు పడకపోవడాన్ని మరో కారణంగా చెప్తున్నారు. జీవితంలో సమస్యలు లేని వారెవరుంటారు? ఉన్నత విద్యాసంస్థలలో చదువుతున్న వారు ఈ మాత్రం ఇబ్బందులకే తట్టుకోలేక జీవితాలను చాలించడమేమిటనేది ప్రశ్న. వృత్తి జీవితంలో లేదా కుటుంబంలో వచ్చే సవాళ్లను కూడా వీరు ఎదుర్కొనలేక పోతున్నారు. పూర్వం మాదిరిగా తండ్రి తాతల, ఇతర బంధుమిత్రుల జీవితాల గురించి తెలుసుకునే అవకాశం, సమయం వీరికి లభించడం లేదు. పంజరంలోని చిలుకలా పిల్లలను పెంచి, ఉన్నత విద్యాసంస్థలకు పంపుతున్నారు. విద్యార్థులను ఈ దుస్థితి నుంచి బయటపడేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థతోపాటు మొత్తం సమాజం మీద ఉన్నది.