బెంగళూరు: కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని సీఎం యెడియురప్ప ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరి చేసింది. కేరళ నుంచి కర్ణాటకకు విమానాలు, బస్సులు, రైళ్లు, ట్యాక్సీలు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ 72 గంటలకు మించకూడదని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కరోనా పరీక్ష నిర్వహించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే విద్య, వ్యాపారం, ఇతర పనుల కోసం కర్ణాటకకు వచ్చిన వారు ప్రతి 15 రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కూడా జూన్ 29న ఇలాంటి నిబంధనలను వర్తింపజేసింది.