న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో బ్యాంకింగ్ సేవలను కస్టమర్ల ముంగిటకే తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ నూతన కంపెనీ ఏర్పాటుకు చేతులు కలిపాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం నెలకొంది. కస్టమర్ల ముంగిటకే బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా పీఎస్బీ అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నూతన కంపెనీ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీ కస్టమర్ల ఇండ్ల వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లేందుకు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) కింద బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలను వినియోగించుకుంటుంది. నూతన కంపెనీకి ఎస్బీఐ మాజీ సీజీఎం, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ రాజీందర్ మిరాఖర్ సీఈఓగా నియమితులయ్యారు.
గతంలో పలు పీఎస్ యూ బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకునేవి. అయితే తక్కవ వ్యయంతో తమ సంస్ధ కరస్పాండెంట్ల సేవలను అన్ని పీఎస్ యూ బ్యాంకులు ఉపయోగించుకోవచ్చని మిరాఖర్ తెలిపారు. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా చెక్ పికప్, అకౌంట్ స్టేట్మెంట్ల రిక్వెస్టులు, పే ఆర్డర్ల డెలివరీ వంటి 11 ఆర్థికేతర సేవలు అందుబాటులో ఉన్నాయి. నగదు విత్ డ్రాయల్స్ సదుపాయాన్ని కస్టమర్ల ఇంటి ముంగిటకే తీసుకురానున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కస్టమర్లు తమ ఇంటి ముందే బ్యాంకింగ్ సేవలను పొందేందుకు వెబ్, మొబైల్ యాప్ లతో పాటు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పంపవచ్చు.