వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా వ్యాప్తి నివారణ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం నుంచి సాధారణ వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. గురువారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి సందర్శించారు. శుక్రవారం నుంచి 50 పడకల సామర్థ్యంతో సాధారణ వైద్యసేవలు ప్రారంభమవుతాయని, త్వరలో 250 పడకలకు పెంచుతామని వెల్లడించారు. ఇక్కడ వైద్య సేవల కోసం ఎంజీఎం నుంచి డాక్టర్లను, పారామెడికల్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిని తరలిస్తామని తెలిపారు. కేంద్రం సహకరించనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. కరోనా వైద్యసేవల కోసం ఎంజీఎం దవాఖానను పూర్తిస్థాయి కొవిడ్ హాస్పిటల్గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణ చర్యలపై, కరోనా బాధితులకు మెరుగైన వైద్యంపై సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఎంజీఎంలో కరోనా మందుల కొరత లేదని, సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎంజీఎంలో ప్రస్తతం 440 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐసీయూ బెడ్స్, 50 వెంటిలేటర్ ఐసీయూ బెడ్స్, 200 ఆక్సిజన్ బల్క్ సిలిండర్లు, 100 బీ టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, 10 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరో 13 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకు ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ఎవరికీ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న అస్యత వార్తలను నమ్మొద్దని కోరారు. ఎంజీఎంలో వరంగల్తోపాటు ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వారు, ఛత్తీస్గఢ్వాసులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని వెల్లడించారు. అనంతరం హన్మకొండలోని పోచమ్మకుంట అర్బన్ హెల్త్ సెంటర్లోని వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఎర్రబెల్లి సందర్శించారు. మే 1 నుంచి అన్ని వయస్సుల వారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు