కేసీఆర్ ఉన్నంత వరకు రైతు బంధు ఉంటుందని పునరుద్ఘాటించి రైతుల్లో ధైర్యం నింపిన ముఖ్యమంత్రి.. యాసంగి పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు పెరిగిన పెట్టుబడులు, మరోవైపు కేంద్రం కొర్రీలతో ఎవుసం యాతనగా మారుతున్న పరిస్థితుల్లో రైతాంగం వెన్నంటి నిలిచారు. 2018 వానకాలం నుంచి నిర్విఘ్నంగా పంట సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో విడుతకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల పది వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సైతం లబ్ధిదారులుగా అవకాశం కల్పించింది. ఆ మేరకు వ్యవసాయ శాఖ 2,43,396 మంది
రైతుల లెక్క తేల్చి..
దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ యాసంగిలో వివిధ పంటల సాగు కోసం ప్రభుత్వం జిల్లా రైతాంగానికి రూ.302.02కోట్ల సాయం అందించనున్నది.రైతులు సాగు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న రైతుబంధు సాయం నిర్విరామంగా కొనసాగుతున్నది. 2018 వానకాలం సాగు నుంచి ప్రారంభమైన ఈ పథకం సంక్షోభ సమయంలోనూ కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఏడు విడుతల్లో అందించిన ప్రభుత్వం ఎనిమిదో విడుతకు సన్నాహాలు చేస్తున్నది.
యాసంగి సాగుకు 2,43,396మంది రైతులకు రూ.302.02కోట్ల రైతు బంధుసాయాన్నిఅందించనున్నది. ఈనెల 10వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు సైతం రైతు బంధు పొందేందుకు అవకాశం కల్పించడంతో వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. యాసంగి సాయానికి 2,43,396మంది అర్హులు ఇప్పటి వరకు ఏడు విడుతల్లో నిర్విఘ్నంగా రైతుబంధు సాయాన్ని అందించిన ప్రభుత్వం ప్రస్తుత యాసంగి సాగుకు ఎనిమిదో విడుతలో అందించే రైతుబంధు సాయం కోసం సన్నాహాలు చేస్తున్నది. గత వానకాలం సీజన్లో రైతుబంధు పథకం కింద సాయం పొందిన రైతులతో పాటు ఈ మధ్యకాలంలో పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి సైతం పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా పాసు బుక్కులు పొందిన వారితోపాటు, గతంలో తప్పుల కారణంగా రైతుబంధు సాయం పొందని రైతుల దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీని కటాఫ్గా నిర్ణయించింది. దీంతో సంబంధిత అధికారులు ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయానికి జిల్లావ్యాప్తంగా 2,43,396మంది అర్హులుగా తేల్చారు. వీరందరికీ రూ.302.02 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. గతంలో మాదిరిగానే తొలుత ఎకరం భూమిలోపు రైతులకు రైతుబంధు సాయం అందిస్తారు. తర్వాత విడుతల వారీగా రెండు, మూడు ఇలా ఐదెకరాల్లోపు రైతులకు సాయం అందించిన తర్వాత మిగిలిన రైతులకు వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
పెద్ద మనస్సు చాటుకున్న కేసీఆర్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది. వరికి బదులు ఇతర పంటలు సాగుచేసే వారికే రైతుబంధును పరిమితం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను వ్యవసాయ శాఖ ప్రభుత్వం వద్ద ఉంచింది. అయితే సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తింపజేసేందుకే నిర్ణయించి పెద్ద మనసు చాటుకున్నారు. కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులకు సైతం ఈనెల 10 కటాఫ్గా పెట్టుకుని రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు వ్యవసాయశాఖ సిద్ధమైంది.
దరఖాస్తులకు ఆహ్వానం.
2020-21 యాసంగి సీజన్ రైతుబంధు సాయం కోసం వ్యవసాయ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 10 నాటికి ధరణిలో నమోదైన, కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ దరఖాస్తులను స్థానిక వ్యవసాయ శాఖ(ఏఈఓ) అధికారులకు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పట్టాదార్ పాసుబుక్ జీరాక్స్ కాపీ లేదా తాసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టిన పత్రం, ఆధార్కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్జిరాక్స్ కాపీలను అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతుబంధు పొందుతున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.